ఈ ట్రాఫిక్ చలాన్లను అమలు చేస్తే కొంప కొల్లేరే: 90 శాతం వరకు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం!
బెంగళూరు: దేశవ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన సరికొత్త వాహన చట్టం..ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తోందో.. ప్రభుత్వాలు కూడా అన్నే ఇక్కట్లను ఎదుర్కొంటోంది. కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన చలాన్ల వల్ల వాహనదారుల నుంచి ఎక్కడ వ్యతిరేకత ఎదురవుతుందోనంటూ మథన పడుతున్నాయి. ట్రాఫిక్ చలాన్ల భారీ నుంచి అతి భారీగా పెంచుతూ మోటారు వాహన చట్టాన్ని సవరించిన భారతీయ జనతాపార్టీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు.
ప్రజల నుంచి వ్యతిరేకత, నిరసనలు ఎదురు కాకుండా ఉండటానికి బీజేపీ పాలిత కర్ణాటక ప్రభుత్వం.. చలాన్ల రేట్లను సవరించింది. భారీగా తగ్గించింది. ఎంత భారీగా అంటే .. 90 శాతం వరకు చలాన్ల రేట్లను కుదించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రవాణా మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్ ను జారీ చేసింది. సవరించిన చలాన్ల రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
తగ్గించిన చలాన్ రేట్ల ప్రకారం.. హెల్మెట్ పెట్టుకోకుండా ద్విచక్ర వాహనాలను నడిపితే ఇదివరకు 1000 రూపాయల జరిమానాను వసూలు చేస్తుండగా.. తాజాగా ఈ మొత్తాన్ని 500 రూపాయలకు కుదించారు. లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే.. ఇదివరకు 5000 రూపాయల మేర చలాన్ ను వాహనదారుడు చెల్లించాల్సి ఉండగా.. దీన్ని 2000 రూపాయలకు తగ్గించారు. ఇలా దాదాపు అన్ని కేటగిరీల్లోనూ జరిమానాల మొత్తాన్ని తగ్గిస్తూ కర్ణాటక ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేసింది.
మద్యం సేవించి వాహనాన్ని నడిపే వారికి మాత్రం విధించే జరిమానాల మొత్తంలో ఎలాంటి మార్పునూ చేయలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరిక వాహనదారులకు విధించే చలాన్ల మొత్తంలో ఎలాంటి మార్పులను చేయలేదు. వాహనాల చలాన్లు భారీ నుంచి అతి భారీ స్థాయిలో ఉన్నాయని, వాటిని యధాతథంగా అమలు చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందంటూ కర్ణాటకలోని బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం మొదటి నుంచీ చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల తరహాలో ఈ చలాన్లను వ్యవహారాన్ని మొత్తంగా ఎత్తేయడానికి నిరాకరించింది. అయినప్పటికీ.. చలాన్ల రేట్లను మాత్రం 90 శాతం మేరకు తగ్గించడం వాహనాదారులకు కొంత ఊరట కలిగించే విషయమే.