జయ: 2 రాష్ట్రాల మధ్య.. కర్నాటక ప్రభుత్వం భయం!
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వ్యాజ్యాన్ని ఆమె స్వరాష్ట్రం తమిళనాడుకు బదలీ చేసేందుకు కర్నాటక సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడిన జయ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.
కావేరీ నదీ జలాలు, తిరువళ్లూవర్, సర్వజ్ఞ విగ్రహాల స్థాపన వంటి వివాదాలతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు బలహీనమయ్యాయి. వీటికి ఇప్పుడు జయలలిత కేసు తోడైంది. ఈ నేపథ్యంలో తమిళ, కన్నడిగుల మధ్య సోదర సంబంధాలు దిగజారకుండా నివారించేందుకు వ్యాజ్యాన్ని తమిళనాడుకు బదలీ చేయడం మినహా మరో మార్గం లేదని కర్నాటక ప్రభుత్వం భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
జయలలిత విషయంలో జైలు అధికారులు నియమావళిని సడలిస్తున్నందుకు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమెకు ఇంటి భోజనాన్ని అనుమతిస్తున్నారు. దీనిని ఎంతోకాలం కొనసాగించడం కష్టంగా ఉంటుందంటున్నారు. మహిళా ఖైదీలు తెల్లరంగు చీరలను ధరించాలి. సిబ్బంది ఇచ్చిన తెల్ల చీరలను ధరించేందుకు జయ నిరాకరించారని తెలుస్తోంది.
ఆమె పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుంటే అది రాజకీయ రంగు పులుముకొని, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల కొనసాగింపుకు అవరోధం అవుతుందని కర్నాటక ప్రభుత్వం ఆందోళన చెందుతోందని తెలుస్తోంది. కర్నాటక హైకోర్టులో జయ బెయిల్ అర్జీ మంగళవారం విచారణకు రానుంది. ఆ రోజు బెయిల్ విషయం తేలకపోతే బదలీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుందని తెలుస్తోంది.