మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి బిగ్ రిలీఫ్, ఆంబిడెంట్ చీటింగ్ కేసు: హై కోర్టు ఆదేశం!
బెంగళూరు: ఆంబిడెంట్ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు. ఎక్కడ బెంగళూరు సీసీబీ పోలీసులతో తనకు సమస్యలు ఎదురౌతాయో అంటు ఆందోళన చెందుతున్న గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు రిలాక్స్ అయ్యారు.
కక్షసాధింపులో భాగంగా తమ మీద ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు నమోదు చేశారని, ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కేసు నుంచి తమకు విముక్తి కల్పించాలని మనవి చేస్తూ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుడు ఆలీఖాన్ కర్ణాటక హై కోర్టులో అర్జీ సమర్పించారు.
అర్జీ విచారణ చేసిన కర్ణాటక హై కోర్టు డిసెంబర్ 4వ తేది (మంగళవారం) వరకు గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుడు ఆలీఖాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ మంగళవారం మళ్లీ అర్జీ విచారణకు వచ్చింది.
తాము ఆదేశాలు జారీ చేసే వరకు గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుడు ఆలీఖాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోరాదని మంగళవారం ఆదేశాలు జారీ చేసిన హై కోర్టు విచారణ వాయిదా వేసింది. హై కోర్టు ఆదేశాలతో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుడు ఆలీఖాన్ తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు.