రిలాక్స్: గాలి జనార్దన్ రెడ్డికి హై కోర్టులో ఊరట, ఆంబిడెంట్ చీటింగ్ కేసు, సీసీబీకి ఆదేశాలు, కక్షతో!
బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు వివాదంలో చిక్కుకున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి ఆ రాష్ట్ర హై కోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. ఆంబి డెంట్ కంపెనీ చీటింగ్ కేసులో తాము సూచించే వరకు గాలి జనార్దన్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆంబిడెంట్ కంపెనీ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ కేసు నుంచి తమకు విముక్తి కల్పించాలని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన అనుచరుడు ఆలీఖాన్ కర్ణాటక హై కోర్టులో అర్జీ సమర్పించారు.
గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుడు ఆలీఖాన్ సమర్పించిన అర్జీ హై కోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. వివరాలు సేకరించిన న్యాయస్థానం డిసెంబర్ 4వ తేదీ వరకు ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీసీబీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుడు ఆలీఖాన్ అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి జామీను మీద బయటకు వచ్చారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే కక్షతో ఇరికించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. హై కోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించడంతో ఆయన అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.