స్టార్ హీరోకు హైకోర్టులో చుక్కెదురు: రూ. 23 లక్షలు అద్దె చెల్లించి ఇల్లు ఖాళీ చెయ్యండి!
బెంగళూరు: స్యాండిల్ వుడ్ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ ఫ్యామిలీకి కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైయ్యింది. మూడు సంవత్సరాలకు పైగా వివాదంలో ఉన్న అద్దె ఇంటి కేసు విచారణలో హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. గడువులోపు ఇళ్లు ఖాళీ చేసి యజమానికి అప్పగించాలని యష్ కుటుంబ సభ్యులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బెంగళూరులోని 42వ సిటీ సివిల్ కోర్టు గత ఏప్రిల్ నెలలో ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు సమర్థించింది. ఇంటి అద్దె చెల్లించి ఇంటిలో ఉండాలని, లేదంటే ఇళ్లు ఖాళీ చెయ్యాలని రాకింగ్ స్టార్ యష్ తల్లి పుష్పాకు హైకోర్టు సూచించింది.
రూ. 23.27 లక్షలు అద్దె
మూడు సంవత్సాలకు పైగా ఇవ్వాల్సిన అద్దె రూ. 23.27 లక్షలు ఇంటి యజమానులకు ఇవ్వాలని యష్ తల్లి పుష్పాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటి అద్దె చెల్లిస్తే మార్చి 31వ తేదీ వరకు అదే ఇంటిలో ఉండాలని, లేదంటే డిసెంబర్ చివరికి ఇళ్లు ఖాళీ చెయ్యాలని రాకింగ్ స్టార్ యష్ తల్లి పుష్పాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టులో సవాల్
గత ఏప్రిల్ నెలలో సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాకింగ్ స్టార్ యష్ తల్లి పుష్పా హైకోర్టును ఆశ్రయించారు. ఇంతకాలం వివాదంలో ఉన్న యష్ ఇంటి వ్యవహారం కర్ణాటకలోని హైకోర్టులో విచారణ జరిగింది.
హైకోర్టు ప్రత్యేక బెంచ్
న్యాయమూర్తులు జస్టిస్ బోపణ్ణ, జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక ద్విసభ్య బెంచ్ విచారణ చేశారు. యష్ కుటుంబ సభ్యులకు ఇల్లు అద్దెకు ఇచ్చిన ఇంటి యజమానులు మునిప్రసాద్, డాక్టర్ వనజా దంపతులు విచారణకు హాజరైనారు.
అద్దె లేదు, ఇంటికి తాళం
మూడున్నర సంవత్సరాల నుంచి యష్ కుటుంబ సభ్యులు ఇంటి అద్దె చెల్లించడం లేదని, యష్ కుటుంబ సభ్యులు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నా మా ఇంటికి తాళం వేసి వారి ఆధీనంలో పెట్టుకుని వేదింపులకు గురి చేస్తున్నారని ఇంటి యజమానులు మునిప్రసాద్, డాక్టర్ వనజా దంపతులు హైకోర్టులో చెప్పారు.
ఆయనఖరీదైన ఇల్లు
బనశంకరి మూడవ స్టేజ్, 3వ బ్లాక్ లోని కత్రిగప్పలోని డోర్ నెంబర్ 757 కలిగిన ఖరీదైన ఇంటిని 2010లో యష్ కుటుంబ సభ్యులకు అద్దెకు ఇచ్చామని ఇంటి యజమానులు మునిప్రసాద్, డాక్టర్ వనజా దంపతులు హైకోర్టులో చెప్పారు.
నెలకు రూ. 40 వేలు
అగ్రిమెంట్ ప్రకారం యష్ కుటుంబ సభ్యులు నెలకు రూ. 40, 000 అద్దె చెల్లించాలని, కొంత కాలం మాత్రం అద్దె చెల్లించారని, తరువాత అద్దె ఇవ్వలేదని, ప్రస్తుతం వారు వేరే ఇంటిలో నివాసం ఉంటున్నా మా ఇంటికి తాళం వేసి వారి ఆధీనంలోనే పెట్టుకున్నారని యజమానులు మునిప్రసాద్, డాక్టర్ వనజా దంపతులు న్యాయస్థానంలో చెప్పారు.
ఇబ్బందులు పెట్టారు
ఇంటిని విక్రయించాలని తాము సిద్దం అయ్యామని, అయితే తాళం వారి దగ్గర ఉండటం వలన కొనుగోలు చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రాలేదని ఇంటి యజమానులు వాపోయారు. వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తులు ఇంటి అద్దె రూ. 23.27 లక్షలు చెల్లిస్తే మార్చి 31వ తేదీలోపు, చెల్లించకపోతే డిసెంబర్ చివరి లోపు ఇల్లు ఖాళీ చెయ్యాలని యష్ తల్లి పుష్పాకు ఆదేశాలు జారీ చేశారు.
హీరోకు ఇల్లు అదృష్టం
కత్రిగుప్ప ఇల్లు అద్దెకు తీసుకున్న తరువాత తమకు అన్నివిదాలుగా అదృష్టం కలిసి వచ్చిందని ఇంతకాలం యష్ కుటుంబ సభ్యులు కోర్టులో చెప్పారు. అయితే యష్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఖరారు చెయ్యడంతో ఇంటి యజమానులు మునిప్రసాద్, వనజా దంపతులకు ఊరట లభించింది.