జైల్లో గాలి జనార్దన్ రెడ్డి పూజలు, నేడు బెయిల్ పిటిషన్ విచారణ, సీసీబీకి కోర్టు చివాట్లు!
బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు నిర్వహులను కేసు నుంచి తప్పిస్తానని డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ బుధవారం జరగనుంది.
గాలి జనార్దన్ రెడ్డి ఖైదీ నెంబర్ 10902: పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు, రూ. 20 కోట్ల డీల్ ?
తనకు బెయిల్ రావాలని గాలి జనార్దన్ రెడ్డి బుధవారం వేకువ జామున పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఆవరణంలో తులసి చెట్టుకు పూజలు చేసి ప్రదక్షణలు చేశారని ప్రముఖ కన్నడ టీవీ చానల్ వార్తలు ప్రసారం చేసింది.
గాలికి లింక్ లేదు
బెంగళూరులోని 1వ ఏసీఎంఎం న్యాయస్థానంలో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చెయ్యాలని ఆయన న్యాయవాదులు హనుమంతరాయప్ప, చంద్రశేఖర్, ఆచార్య మంగళవారం పిటిషన్లు దాఖలు చేశారు. ఆంబిడెండ్ కంపెనీ నిర్వహకుల నుంచి గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు ఆలీఖాన్ 57 కేజీలు బంగారం తీసుకున్నారని కేసు నమోదు అయ్యిందని గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాదులు అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి నేరుగా బంగారం తీసుకున్నట్లు కేసు నమోదు కాలేదని ఆయన న్యాయవాదులు కోర్టులో వాదించారని తెలిసింది.
సీసీబీకి చివాట్లు
గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాదులు, సీసీబీ వాదనలు విన్న న్యాయస్థానం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిందని సమాచారం. ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి నేరుగా సంబంధం ఉందా ? ఆయన నేరుగా ప్రజలను మోసం చేశారా ? అని న్యాయస్థానం సీసీబీ పోలీసులను పోలీసులను ప్రశ్నించింది.
కేసు ఒకటి, దర్యాప్తు ఒకటి
ఫిర్యాదు ఉండేది ఒకటి, మీరు దర్యాప్తు చేస్తున్నది మరొకటి అంటూ సీసీబీ పోలీసులను న్యాయస్థానం ప్రశ్నించింది. ఆంబిడెంట్ బాధితులు, ఫిర్యాదు చేసిన వారు గాలి జనార్దన్ రెడ్డి మీద కేసు పెట్టలేదని, మీరు మాత్రం ఆయనకు కేసుతో సంబంధం ఉందని ఎలా చెబుతున్నారు అని న్యాయస్థానం సీసీబీ పోలీసులను ప్రశ్నించిందని తెలిసింది.
రూ. 18 కోట్లు నేనే ఇస్తా
ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో మద్యంతర జామీను తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు ఆలీఖాన్ జామీను రద్దు చెయ్యాలని సీసీబీ పోలీసులు న్యాయస్థానంలో అర్జీ సమర్పించారు. ఇదే సమయంలో ఆలీఖాన్ సైతం కోర్టును ఆశ్రయించారు. తన మీద చేసిన ఆరోపణలు రుజువు అయితే రూ. 18 కోట్లు తానే ఇస్తానని ఆలీఖాన్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని తెలిసింది.
తులసి చెట్టుకు పూజలు
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో గాలి జనార్దన్ రెడ్డి విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. బుధవారం గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ అర్జీ విచారణకు రానుంది. బుధవారం వేకువ జామున గాలి జనార్దన్ రెడ్డి స్నానం చేసి జైలు ఆవరంలోని తులసి చెట్టుకు పూజలు చేశారని ప్రముఖ కన్నడ టీవీ చానల్ వార్తలు ప్రసారం చేసింది.
నేడు కోర్టులో విచారణ
ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ బుధవారం జరగనుంది. మంగళవారం 1వ ఏసీఎంఎం న్యాయస్థానంలో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చెయ్యాలని ఆయన న్యాయవాదులు అర్జీ సమర్పించారు. వాదనలు విన్న న్యాయస్థానం బుధవారానికి అర్జీ విచారణ వాయిదా వేసింది. గాలి జనార్దన్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదని, ఆయనకు కచ్చితంగా బెయిల్ వస్తోందని ఆయన న్యాయవాదులు అంటున్నారు.