స్టూడెంట్ అవతారం ఎత్తిన ఆరోగ్య శాఖ మంత్రి
బెంగళూరు: కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖ మంత్రి యు.టి. ఖాదర్ స్టూడెంట్ అవతారం ఎత్తారు. చక్కగా విద్యార్థుల మద్య కుర్చుకుని ముచ్చటగా మూడు గంటల పాటు ఎంఏ పరీక్షలు వ్రాసి చక్కగా తన విధులకు వెళ్లిపోయారు.
మంగళవారం బెంగళూరు నగరంలోని చామరాజపేటలోని ఆస్టీన్ కాలేజ్ లో పరీక్షలు వ్రాయడానికి యు.టి. ఖాదర్ ప్రయివేటు కారులో వచ్చారు. మద్యాహ్నం రెండు గంటలకు పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు. విద్యార్థుల మధ్య కూర్చుని సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు వ్రాశారు.
ఆరోగ్య శాఖ మంత్రి ఖాదర్ ఇప్పటికే బీఏ, ఎల్ఎల్ బీ పూర్తి చేశారు. అయితే ఎంఏ పట్టా సంపాదించాలని మంత్రికి చాల కాలం నుండి ఆశగా ఉంది. అందుకే 2014-15 సంవత్సరంలో ఎంఏ మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాస్తున్నారు. గురువారం మరో పరీక్ష వ్రాయడానికి సిద్దం అవుతున్నారు.
ఎంఏ మొదటి సంవత్సరంలో ఐదు పరీక్షలు వ్రాయవలసి ఉంది. అయితే ఆరోగ్య శాఖ లో ప్రతి నిత్యం పని ఒత్తిడి ఎక్కువ ఉండటం, గ్రామీణ పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నందు వలన మంత్రి ఖాదర్ ప్రస్తుతం రెండు పరీక్షలు మాత్రం వ్రాస్తున్నారు.