మాజీ ప్రధాని మనుమడికి హైకోర్టు సమన్లు, ఎంపీ పదవికి ఎసరు?, చిక్కుల్లో ఫ్యామిలీ !
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ మనుమడు, జేడీఎస్ పార్టీకి చెందిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు సమన్లు ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ ప్రకటించిన ఆస్తులకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆయనకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీ పదవికి ఎసరు వచ్చే అవకాశం ఉందని, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఫ్యామిలీ చిక్కుల్లో పడే అవకాశం ఉందని సమాచారం.
మోసం చేశారు
హాసన్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారని జేడీఎస్ పార్టీ నాయకులు ప్రజ్వల్ రేవణ్ణను పొగిడారు. అయితే ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను మోసం చేశారని ప్రజ్వల్ రేవణ్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
హైకోర్టుకు బీజేపీ లీడర్
ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చి అందర్నీ మోసం చేశారని, వెంటనే ఆయన ఎంపీ పదవిని రద్దు చెయ్యాలని (అనర్హుడు) లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఏ. మంజు జూన్ 26వ తేదీ కర్ణాటక హై కోర్టును ఆశ్రయించారు.
భారీ మెజారిటి
మొదటిసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజ్వల్ రేవణ్ణ బీజేపీ అభ్యర్థి ఏ. మంజు మీద 1.40 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. జేడీఎస్ నుంచి పోటీ చేసిన మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ సైతం గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు. జేడీఎస్ పార్టీ నుంచి పోటీచేసి గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టిన ఏకైక ఎంపీగా ప్రజ్వల్ రేవణ్ణ రికార్డు సృష్టించారు.
హై కోర్టుకు నివేదిక
ప్రజ్వల్ రేవణ్ణ చేతిలో ఓడిపోయిన బీజేపీ నాయకుడు ఏ. మంజు సమర్పించిన అర్జీని కర్ణాటక హై కోర్టు పరిశీలించింది. కర్ణాటక హై కోర్టు హాసన్ జిల్లా అధికారి నుంచి ప్రజ్వల్ రేవణ్ణ ఇచ్చిన ఆస్తి వివరాల నివేదిక తెప్పించుకుంది. నివేదిక పరిశీలించిన కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి జాన్ మైకెల్ మీ ఆస్తుల విషయంలో పూర్తి వివరణ ఇవ్వాలని ప్రజ్వల్ రేవణ్ణకు సమన్లు జారీ చేశారు. కర్ణాటక హై కోర్టు తదుపరి విచారణ సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.
ఎంపీ సీటుకు ఎసరు ?
మాజీ ప్రధాని హెచ్.డీ. రేవణ్ణ మనుమడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తప్పుడు ఆస్తి వివరాలు సమర్పించారని వెలుగు చూస్తే ఆయన ఎంపీ పదవికి ఎసరు వచ్చే అవకాశం ఉంది. ప్రజ్వల్ రేవణ్ణకు ఎంపీ పదవి పోవడంతో పాటు ఆరు సంవత్సరాలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం లేకుండా పోతుంది.
మాజీ ప్రధాని ఫ్యామిలీకి చిక్కులు !
ప్రజ్వల్ రేవణ్ణ అక్రమ ఆస్తుల వివరాలు ఇచ్చారని వెలుగు చూస్తే మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కుటుంబ సభ్యులకు చిక్కులు తప్పవని న్యాయనిపుణులు అంటున్నారు. అయితే హై కోర్టు జారీ చేసిన సమన్లు ఇంకా ప్రజ్వల్ రేవణ్ణ చేతికి అందలేదని జేడీఎస్ నాయకులు అంటున్నారు.