యూపీలో రౌడీల ఎన్ కౌంటర్, బెంగళూరులో అదే గతి: హోం మంత్రి ఆదేశం, తుపాకితో!
బెంగళూరు: ఉత్తరప్రదేశ్ లో రౌడీలను ఎలా ఎన్ కౌంటర్ చేస్తున్నారో కర్ణాటకలో కూడా అదే తరహాలో రౌడీషీటర్లకు బుద్ది చెప్పాలని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్యంగా బెంగళూరు నగరంతో సహ రాష్ట్రంలోని అన్ని నగరాల్లో రౌడీషీటర్లను ఏరిపారేయాలని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విదాన సౌధలో మీటింగ్
బెంగళూరులోని విదాన సౌధలో పోలీసు అధికారులతో సమావేశం అయిన హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి పలు విషయాలపై చర్చించారు. రౌడీషీటర్లు, బార్లు, హుక్కా బార్లు, మట్కా, గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టాలని రామలింగా రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. అనంతరం మంత్రి రామలింగా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బార్ అండ్ రెస్టారెంట్లు
బెంగళూరు నగరంతో సహ రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్లు అధికారులు సూచించిన సమాయానికి ఉదయం తియ్యాలని, చెప్పిన సమయానికి రాత్రి మూసివేయాలని పోలీసు అధికారులకు చెప్పానని మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. చోరీ చేసిన సొత్తు ఎవరు కొనుగోలు చేసినా కేసులు నమోదు చేస్తామని మంత్రి రామలింగా రెడ్డి హెచ్చరించారు.
వడ్డీ వ్యాపారులు
బెంగళూరులో హుక్కా బార్లు మూసివేస్తున్నా వారు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారని, అందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. అధిక వడ్డి వసూలు చేసి పేదలను పీడిస్తున్న వడ్డీ వ్యాపారుల అంతు చూడాలని పోలీసు అధికారులకు సూచించానని మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు.
బీజీపీ అధికారంలో 1,160 హత్యలు
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో 1,160 హత్యలు జరిగాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 998 హత్యలు జరిగాయని, బీజేపీ పాలనలో కంటే మా పాలనలో నేరాలు చాల వరకూ తగ్గిపోయాయని, లైంగిక దాడులు తక్కువ అయ్యాయని మంత్రి రామలింగా రెడ్డి వివరించారు.
బీజేపీ హయంలో బాంబుపేలుళ్లు
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో మూడు బాంబు పేలుళ్లు జరిగాయని, చర్చిల మీద దాడులు చేశారని, బెంగళూరు నగరంలో ఉంటున్న 50 వేల మంది ఈశాన్య భారతీయులు దాడులు చేస్తున్నారనే భయంతో నగరం విడిచి పారిపోయారని, కాంగ్రెస్ హాయంలో ఇలాంటి సంఘటనలు జరగలేదని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి వివరించారు.