అసభ్యంగా మాట్లాడితే అరెస్టు గ్యారెంటి, హోం మంత్రి, విలేకరి అయినా సరే, అంతే!
బెంగళూరు: ప్రభుత్వం ఎవ్వరినీ టార్గెట్ చేసి అరెస్టులు చెయ్యలేదని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, చట్ట వ్యతిరేకంగా దూషించినా చర్యలు తీసుకోవాలని పోలీసులకు తానే ఆదేశాలు జారీ చేశానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (హోం శాఖ మంత్రి కూడా ఆయనే) డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన డాక్టర్ జీ. పరమేశ్వర్ హోం శాఖ కూడా తన దగ్గరే ఉన్నందున పోలీసు అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇస్తున్నానని అన్నారు. టిప్పు సుల్తాన్ జయంతి విషయంలో పాత్రికేయుడు సంతోష్ తమ్మయ్య వ్యవహరించిన తీరు ఓ వర్గంలో చిచ్చురేపిందని, వారిని మానసికంగా గాయపరిచిందని డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల గురించి ఆరోపణలు, విమర్శలు చేసే హక్కు ప్రజలకు ఉందని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. అయితే ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన టిప్పుసుల్తాన్ జయంతి గురించి అసభ్యంగా దూషించిన వారు ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు తానే సూచించానని డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.
వ్యక్తిగతంగా తాము ఎవ్వరినీ టార్గెట్ చెయ్యడం లేదని, చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ జీ. పరమేశ్వర్ సమర్థించుకున్నారు. టిప్పుసుల్తాన్ జయంతిని ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించకూడదని బీజేపీ, ఆర్ఎస్ఎస్, పలు హిందూ సంఘ, సంస్థలు అనేక ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నాయి.
కొడుగులో ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాత్రికేయుడు సంతోష్ తమ్మయ్య టిప్పుసుల్తాన్ జయంతి విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంతోష్ తమ్మయ్య వ్యాఖ్యలపై వివాదం చలరేగడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మంగళవారం సంతోష్ తమ్మయ్య బెయిల్ మీద విడుదల అయ్యారు.