తబ్లిగీలు హీరోలంటూ ప్రశంసలు- చిక్కుల్లో కర్నాటక ఐఏఎస్ అధికారి...
ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ లో మతపరమైన సమావేశానికి హాజరై కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన తబ్లిగీ జమాత్ సభ్యుల వ్యవహారం దేశవ్యాప్తంగా ఏ స్ధాయిలో చర్చనీయాంశమైందో తెలిసిందే. ఇప్పటికీ తబ్లిగీల పేరు చెబితే చాలా రాష్ట్రాల్లో జనం ఉలిక్కిపడే పరిస్ధితి. కానీ తాజాగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న తబ్లిగీ జమాత్ సభ్యుల నుంచి ప్లాస్మా సేకరించడాన్ని ప్రశంసిస్తూ ఓ కర్నాటక ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ తాజాగా కలకలం రేపింది.
Recommended Video
కేవలం ఢిల్లీలోనే 300 మంది తబ్లిగీల ప్లాస్మా సేకరిస్తున్నారు. ఇప్పుడేమంటారు అంటూ అప్పట్లో తబ్లిగీలను విమర్శించిన వారిని ఉద్దేశించి ఐఏఎస్ అధికారి మొహిసిన్ చేసిన ట్వీట్ పై కర్నాటక ప్రభుత్వం మండిపడింది. ఆలిండియా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడంపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సున్నితమైన కరోనా సమస్యపై మీరు పెట్టిన ట్వీట్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కరోనాపై పేరులో ప్రతికూల ప్రభావం చూపేలా ఉందంటూ కర్నాటక ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. దీనిపై ప్రస్తుతం కర్నాటకలో దుమారం రేగుతోంది.
బీహార్ కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మెహిసిన్ గతంలోనూ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. గతేడాది కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ హెలికాఫ్టర్ లో తనిఖీలకు ఆదేశాలు ఇచ్చిన వ్యవహారంలో మెహిసిన్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పటికే యడ్యూరప్ప సర్కారు ఆయన్ను అప్రాధాన్య శాఖల్లోనే కొనసాగిస్తోంది. అయితే తాజాగా ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసులపై స్పందించిన మెహిసిన్.. తాను ఓ ప్రైవేటు మీడియా ఛానల్ కథనాన్ని మాత్రమే ట్వీట్ చేశానని, దీనిపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. త్వరలో ప్రభుత్వానికి సమధానం పంపుతానన్నారు.