కరోనా: ఫుడ్ హెల్ప్లైన్ నంబర్గా కర్ణాటక ఐపీఎస్ మొబైల్..? రోజుకు 100 కాల్స్, 4 వేల మంది ఆకలితీర్చిన.
అసలే కరోనా టెన్షన్.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్.. ఎక్కడివారు అక్కడే నిర్బంధం. ఈ సమయంలో వలస కూలీలను ఆయా ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. ఆహారం కావాలలంటే ఈ నంబర్కు ఫోన్ చేయండి అంటూ ఒక నంబర్ బీహర్, కేరళ, జార్ఖండ్తోపాటు కర్ణాటకలో కూడా స్ప్రెడ్ అయ్యింది. అయితే అది చేసిన మంచి పనికి లభించిన గుర్తింపు. కానీ ఆ నంబర్ గల ఐపీఎస్ అధికారికి రోజుకు 100 ఫోన్ కాల్స్ వచ్చేవి. దీంతో అతను ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడు.
ఇటీవల బెంగళూరులో 400 మంది బీహార్కు చెందిన కూలీలు చిక్కుకున్నారు. వారికి సీనియర్ ఐపీఎస్ అధికారి సీమంత్ అండగా నిలిచారు. వారి ఆచూకీ కనుక్కొని.. ఏడీజీపీ దయానంద్ సాయంతో 400 ఆహార పొట్లాలు అందజేశారు. తర్వాత బీహర్ మీడియా సీమంత్ను పొగడ్తలతో ముంచెత్తింది. కథనంతోపాటు సీమంత్ కుమార్ మొబైల్ నంబర్ కూడా ప్రసారం చేయడంతో సమస్య ప్రారంభమైంది. ఇక అప్పటినుంచి సీమంత్ పర్సనల్ నంబర్ వాట్సాప్ గ్రూపులలో షేర్ అవుతోంది. ఆయా ప్రాంతాల నుంచి కూలీలు ఆహారం కోసం ఫోన్ చేస్తూనే ఉన్నారు.
దీంతో ప్రతీరోజు సీమంత్కు వంద కాల్స్ వస్తున్నాయి. ఆహారం అందించాలని కోరడంతో ఇదెక్కడి సమస్యరా నాయనా అనుకొన్నారు. మొదటి రెండురోజులు షాక్కు గురయ్యానని చెప్పారు. తర్వాత స్వచ్చంద సంస్థల సాయం, ఇతరులతో కలిసి అన్నార్తులకు ఆహారం అందించామని వివరించారు. 4 వేల మంది ఆకలి తీర్చినట్టు వివరించారు. ఇప్పుడు తనకు కూలీల నుంచి కాకుండా ఎన్జీవో నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. వారిని పేదలకు సాయం చేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు.