పతనం అంచుల్లో సర్కార్: సీనియర్ల అసమ్మతి గళం: ఒకరి రాజీనామా!
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సారథ్యంలోని సంకీర్ణ సర్కార్ మనుగడ ప్రమాదంలో పడింది. పతనం అంచుల్లో నిలిచింది. చెరో పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు అసమ్మతి గళాన్ని వినిపించారు. వారిలో ఒకరు ఏకంగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చేశారు కూడా. అసలే బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి కుమారస్వామికి ఇది ఊహించని పరిణామం. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుంది సంకీర్ణ సర్కార్ పరిస్థితి.
జనతాదళ్(సెక్యులర్) కర్ణాటక అధ్యక్షుడు హెచ్ విశ్వనాథ్ మంగళవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. తాను పదవిలో కొనసాగలేనని అన్నారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడకు అందజేశారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను ఆయన అందులో పొందుపరిచారు.
నైతిక బాధ్యత మాత్రమేనా?
మొన్నటి లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలను సాధించకపోవడం వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నానని, ఇందులో భాగంగా తాను తప్పుకొంటున్నానని చెప్పుకొచ్చారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో జనతాదళ్ (ఎస్) ఘోర పరాజయాన్ని చవి చూసింది. మండ్య నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ గౌడ, తుమకూరు నుంచి బరిలో దిగిన ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ సైతం ప్రత్యర్థలు చేతుల్లో మట్టి కరిచారు.
మట్టి కరిచిన కాంగ్రెస్-జేడీఎస్..
కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు చేసుకున్న జనతాదళ్ (ఎస్) మొత్తం 10 లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా.. ఒక్కచోట మాత్రమే నెగ్గ గలిగింది. కాంగ్రెస్ సైతం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒకే ఒక్క సీటును కైవసం చేసుకోగలిగింది. 28 లోక్సభ స్థానాలు ఉన్న కర్ణాటకలో 25 సీట్లల్లో కమలనాథులు జెండా పాతేశారు. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మండ్య నుంచి ఘన విజయాన్ని సాధించిన తెలుగింటి ఆడపడచు సుమలతను కూడా ఈ ఖాతాలోనే వేస్తే.. ఈ సంఖ్య 26కు చేరుతుంది.
ఆపరేషన్ లోటస్..మళ్లీ
లోక్సభ ఫలితాల తరువాత కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్కు కేవలం ఎనిమిది సీట్ల దూరంలో నిలిచిపోయిన కమలనాథులు.. మరోమారు ఆపరేషన్ లోటస్ను తెరమీదికి తీసుకొచ్చారు. ఆపరేషన్ ఆకర్షను ఆరంభించారు. అధికారంలో ఉన్నప్పటికీ.. మెజారిటీ లోక్సభ స్థానాలను దక్కించుకోలేకపోయిన ప్రభావం కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల్లో ప్రకంపనలకు దారి తీసింది. నైతిక బాధ్యత పేరుతో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ రాజీనామా చేశారు. పార్టీ అభ్యర్థుల ఓటమికి తాను నైతిక బాధ్యత వహిస్తున్నానని చెబుతున్నప్పటికీ.. అది ఓ కారణం మాత్రమేననే అభిప్రాయాలు ఉన్నాయి.
చేతులు కట్టేశారు..అందుకే ఓటమి..
లోక్సభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపికలో తన చేతులను కట్టేశారని, ఏ మాత్రం స్వేచ్ఛ ఇవ్వలేదనే ఆవేదన విశ్వనాథ్లో వ్యక్తమౌతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ టికెట్లను ఇష్టానుసారంగా, అనర్హులకు ఇచ్చుకున్నారనేది ఆయన ఆవేదన. పార్టీ అధ్యక్షుడినైన తాను స్వయంగా సూచించిన నాయకులకు కూడా టికెట్లు ఇవ్వలేదని విశ్వనాథ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆయా కారణాల వల్ల ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ సీనియర్ అసమ్మతి గళం..
కాంగ్రెస్ మాజీ మంత్రి, సీనియర్ నేత రామలింగా రెడ్డి కూడా తన అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. దాదాపు ఆయన కూడా విశ్వనాథ్ లైన్నే అంది పుచ్చుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో సరిదిద్దుకోలేని తప్పులు చోటు చేసుకున్నాయని, దాని ఫలితాన్ని తాము ఇప్పుడు అనుభవిస్తున్నామని అన్నారు. సీనియర్ల సూచలను ఏ మాత్రం పట్టించుకోలేదని రామలింగారెడ్డి ఆరోపిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కొందరు సీనియర్ నేతలు ఒంటెత్తు పోకడలు అనుసరించారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం పార్టీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా పరిష్కరించాల్సిన అవసరం పార్టీ అధిష్ఠానం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. సీనియర్లు పార్టీలో ఉండలేరని చెప్పారు. పార్టీని వీడుతానని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.