రాయి టెంకాయి భేటీ: రసవత్తర రాజకీయాలు, కాంగ్రెస్ లో గుబులు, బీజీపికి ఆశలు: ఏం జరుగుతోంది!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలోని నాయకులు రోజుకో మాట మాట్లాడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం విషయంలో బీజేపీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. రాయి టెంకాయి భేటీ కావడంతో కాంగ్రెస్ లో గుబులు మొదలైయ్యింది.
కర్ణాటక జేడీఎస్ శాఖ అధ్యక్షుడు, మాజీ మంత్రి హెచ్. విశ్వనాథ్, ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ తో భేటీ అయ్యారని ప్రచారం జరగడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు. మాజీ సీఎం సిద్దరామయ్య మద్దతుదారుల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి హెచ్. విశ్వనాథ్ సిద్దం అయ్యారు.
మైసూరులోని జయలక్ష్మీపురంలోని శ్రీనివాస్ ప్రసాద్ ఇంటికి హెచ్. విశ్వనాథ్ వెళ్లి చర్చలు జరిపారని వెలుగు చూసింది. లోక్ సభ ఎన్నికల ప్రచారం సమయంలో హెచ్. విశ్వనాథ్ ను మాజీ సీఎం సిద్దరామయ్య దూరం పెట్టారు. మంత్రి జీటీ. దేవేగౌడతో కలిసి సిద్దరామయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హెచ్. విశ్వనాథ్ తో కలిసి ఎన్నికల ప్రచారం చెయ్యడానికి సిద్దరామయ్య అప్పట్లో అంగీకరించలేదు. ఈ సందర్బంలో హెచ్. విశ్వనాథ్ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస్ ప్రసాద్ ఇంటికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరపడంతో అందరూ ఆశ్చర్యానికి గురైనారు.
కర్ణాటక సీఎం కుమారస్వామిని మార్చాలని కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జేడీఎస్ నాయకులు బీజేపీ నాయకులతో చర్చలు జరపడం మరింత గందరగోళానికి కారణం అయ్యింది. మొత్తం మీద రాయి టెంకాయి భేటీ కావడంతో కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.