వరదల దెబ్బకు లేడీ ఎమ్మెల్యే ఇల్లు జలమయం, రైల్వేస్టేషన్, హై వేలు మునిగిపోయాయి !
బెంగళూరు: కర్ణాటకలోని బెళగావిలో కురుస్తున్న భారీ వర్షాలకు, వరదల దెబ్బకు ఖానాపుర్ ఎమ్మెల్యే అంజలి నింబాళ్కర్ ఇల్లు పూర్తిగా జలమయం అయ్యిందని వెలుగు చూడటంతో స్థానికులు షాక్ కు గురైనారు. సామాన్య ప్రజలకే కాదు ఎమ్మెల్యే అంజలి నింబాళ్కర్ కు సైతం వాన, వరదల దెబ్బ పడటంతో స్థానిక అధికారులు, సిబ్బంది సహాయక చర్యలలో నిమగ్నం అయ్యారు.
బెళగావి, హుబ్బళి, గదగ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్రలో పడుతున్న భారీ వర్షాల కారణంగా బెళగావి జిల్లాలో వరద ప్రవాహం ఎక్కువ అయ్యింది. ఈ దెబ్బకు లేడీ ఎమ్మెల్యే అంజలి నింబాళ్కర్ ఇంటితో పాటు ఆ పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మలప్రభా నది పొంగిపొర్లుతోంది. మలప్రభా నది దెబ్బకు ఆ ప్రాంతాల్లోని జలాశయాలు నిండిపోయాయి. జలాశయాల్లో నీరు నిండిపోవడంతో నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల దెబ్బకు బెళగావి- కోల్లాపుర జాతీయ రహదారిలో కేవలం అర్దగంట సమయంలో సుమారు మూడు కిలోమీటర్ల వరకూ వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.
భారీ వర్షాలకు జాతీయ రహదారి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. జాతీయ రహదారిలో నీరు పూర్తిగా పక్కకు పోయే వరకు సంచరించరాదని బెళగావి ఉత్తర విభాగం ఐజీపీ రాఘవేంద్ర సుహాస్ ప్రజలకు, వాహనచోదకులకు మనవి చేశారు. భారీ వర్షాల దెబ్బకు రైల్వే పోలీస్ స్టేషన్ లో రెండు అడుగుల ఎత్తు నీరు నిలిచిపోయింది. రైల్వే పోలీస్ స్టేషన్ లోని పలు కీలక డాక్యూమెంట్లు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.