నిన్న మాజీ సీఎం, మొన్న మంత్రి.. నేడు పోలీసులు.. మహిళలంటే గౌరవం లేదా?
బెంగళూరు : కర్ణాటకలో వరుసగా జరుగుతున్న ఘటనలు వివాదస్పదమవుతున్నాయి. లీడర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు మహిళలంటే గౌరవం లేకుండా పోయిందనేది చర్చానీయాంశంగా మారింది. నిన్న మాజీ సీఎం సిద్ధరామయ్య, మొన్న పర్యాటక శాఖ మంత్రి సా.రా.మహేశ్, తాజాగా పోలీసులు.. మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం వైరల్ గా మారింది. ప్రజలకు జవాబుదారీగా ఉండేవారు ఇలా ప్రవర్తించడం సరికాదనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి.
పీఎస్ పంచాయితీ
బెంగళూరు కుమారస్వామి లేఔట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటన వివాదస్పదంగా మారింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలపై ఏఎస్ఐ చేయి చేసుకోవడంతో దుమారం రేగింది. ఏపీకి చెందిన ఓ యువతి బెంగళూరులోని ఓ హోటల్ లో పనిచేస్తోంది. ఆమెకు 11 ఏళ్ల వయసులోనే మేనమామతో వివాహం చేశారు. అయితే గతేడాది ఆమె భర్తను వదిలేసి బెంగళూరుకు చేరుకుంది. ఆ యువతి హోటల్ లో పనిచేస్తుందనే సమాచారంతో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. తమ వెంట రావాలని కోరగా ఆమె నిరాకరించింది. ఈ నేపథ్యంలో బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ నేపథ్యంలో హోటల్ యజమాని కుమారస్వామి లేఔట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
రెచ్చిపోయిన ఎఎస్ఐ
కుటుంబ సభ్యులతో వెళ్లేది లేదంటూ.. ఆ యువతి మొండికేయడంతో పోలీస్ స్టేషన్ లో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఎలాగైనా ఆమెను తమతో పంపించాలంటూ వారు పట్టుబట్టారు. ఆ సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ హెచ్చరించింది. అప్పుడే స్టేషన్ కు వచ్చిన ఎఎస్ఐ సదరు మహిళపై సీరియస్ అయ్యారు. సహనం కోల్పోయి మాటలు తూలుతూ మెడపట్టి బయటకు గెంటేశారు. ఆమెతో పాటు ఉన్న మరో యువతిపై చేయి చేసుకున్నాడు. అయితే ఈ తతంగమంతా అక్కడే ఉన్న ఓ పోలీస్ వీడియో తీయడం.. అది కాస్తా వైరల్ కావడంతో ఎఎస్ఐ దుర్మార్గం వెలుగుచూసింది.
ఓవర్ యాక్షన్.. సస్పెండ్
సదరు ఎఎస్ఐ తీరు వివాదస్పదం కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మహిళలపై అలా ప్రవర్తించడం ముమ్మాటికీ తప్పేనంటూ చెప్పుకొచ్చారు. ఎఎస్ఐని సస్పెండ్ చేయడమే గాకుండా తదుపరి దర్యాప్తుకు ఆదేశించారు సౌత్ జోన్ విభాగం డీసీపీ అణ్ణామలై. అటు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది.
మొన్న మంత్రి.. నిన్న సీఎం
ఇటీవల సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి అంత్యక్రియల సందర్భంగా... పర్యాటకశాఖ మంత్రి సా.రా.మహేశ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన అంత్యక్రియలకు హాజరు కావడానికి తుమకూరులోని మఠంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు మంత్రి. అక్కడే విధుల్లో ఉన్న ఎస్పీ దివ్య ఆయన్ను ఆపాల్సి వచ్చింది. దీంతో మంత్రి కోపం తారాస్థాయికి చేరింది. నన్నే ఆపుతావా అంటూ మహిళ అని చూడకుండా నోటికి పని చెప్పారు. బ్లడీ రాస్కెల్ అంటూ తీవ్రంగా మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఎస్పీ.. కన్నీళ్లు రాల్చారు. అయితే వెంటనే తేరుకున్న మంత్రి.. విషయం పెద్దది చేయొద్దంటూ సూచించారట. ఆమె కూడా విధి నిర్వహణలో అవన్నీ కామన్ అంటూ సర్దిచెప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
తాజాగా మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. తన కొడుకు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఓ మహిళ నిలదీయడంతో ఆమెను వారించారు. అక్కడితో ఆగకుండా ఆమె చేతిలోని మైకు లాక్కునేందుకు ప్రయత్నించారు. అయితే మైకుతో పాటు ఆమె ధరించిన చున్నీ రావడంతో దుమారం రేగింది. మీడియాలో వైరల్ కావడంతో మహిళ కమిషన్ సిద్ధరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు ఆమె తనకు సోదరిలాంటిదని ఆయన రెస్పాండ్ కావడంతో వివాదం సద్దుమణిగింది.