కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, మంత్రి పదవి కోసం పోటీ !
బెంగళూరు: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. జూన్ 11వ తేదీన కర్ణాటకలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ఖారారు చేసి ప్రకటించింది.
ఎన్నికల ఫలితాలు
జూన్ 17వ తేదీకి 11 మంది ఎమ్మెల్సీల పదవికాల పూర్తి అవుతుంది. ఈ సందర్బంలో జూన్ 11వ తేదీ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే తెలిపారు.
హైకమాండ్ మీద ఒత్తిడి
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని చాల మంది ప్రయత్నించారు. ఢిల్లీలోని హైకమాండ్ మీద చాల మంది నాయకులు, వ్యాపారులు ఒత్తిడి చేశారు. అయితే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చించిన కాంగ్రెస్ హైకమాండ్ చివరికి నలుగురి పేర్లు ఖరారు చేసింది.
ఎమ్మెల్సీ అభ్యర్థులు
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం. ఇబ్రహీం, కె. గోవిందరాజు, కె. హరీష్ కుమార్, అరవింద కుమార్ ఎస్. అరళి జూన్ 11వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం. ఇబ్రహీం, ఎంఆర్. సీతారాం, మోటమ్మ, కె గోవిందరాజుల పదవి కాలం జూన్ 17వ తేదీతో పూర్తి కానుంది.
సిద్దూ మార్కు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు సీఎం. ఇబ్రహీం, కె. గోవిందరాజుకు మళ్లీ అవకాశం కల్పించింది. జూన్ 17వ తేదీ బీజేపీకి చెందిన ఎమ్మెల్సీలు బీజే. పుట్టరాజు, డీఎస్. వీరయ్య, సోమణ్ణ బేవినమదర్, రఘనాథ మల్కాపుర పదవి కాలం పూర్తి అవుతుంది.
మంత్రి పదవి కోసం పోటీ
కర్ణాటకలో అధికారంలో ఉన్న జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులు కావాలని చాల మంది ఆశపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మోటమ్మ మళ్లీ తాను ఎమ్మెల్సీ పదవి తీసుకుని మంత్రి కావాలని ప్రయత్నించారు. ఈసారి మోటమ్మకు మళ్లీ అవకాశం ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ నిరాకరించింది.