లైంగికంగా హింసించి హత్యలు: సైనేడ్ మోహన్కు జీవిత ఖైదు, తప్పిన ఉరి..
సీరియల్ కిల్లర్ మోహన్ కుమార్కు కింది కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మారుస్తూ గురువారం తీర్పు వెలువరించింది.
బనశంకరి: సీరియల్ కిల్లర్ మోహన్ కుమార్కు కింది కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మారుస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు రవి మళిమఠ్, మైకన్కున్హా కేసు విచారణ చేసి మరణశిక్షను రద్దు చేసి జీవితఖైదు విధిస్తున్నట్లు తెలిపారు.
నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోను జైలు నుంచి విడుదల చేసేది లేదని కోర్టు స్పష్టం చేసింది. జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొంది. భవిష్యత్తులోను నిందితుడు మోహన్ పట్ల క్షమాగుణంతో వ్యవహరించేది లేదని కోర్టు తేల్చి చెప్పింది.
దక్షిణ కన్నడ జిల్లాలో 2004 నుంచి 2009 వరకు 20 మంది మహిళలపై అతికిరాతకంగా అత్యాచారం జరిపి అనంతరం వారిని సైనేడ్తో హత్య చేసిన కేసుల్లో మోహన్ కుమార్కు దిగువ కోర్టు అప్పట్లో మరణ శిక్ష విధించింది. దక్షిణ కన్నడ జిల్లా 4వ అదనపు సెషన్స్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
కాగా, వృత్తిరీత్యా టీచర్ అయిన మోహన్.. క్రమేపీ నేరాల వైపు మళ్లాడు. మహిళలను, బాలికలను ఎత్తుకెళ్లి అత్యాచారం చేయడం, సైనేడ్ తో హత్య చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇలాంటి వ్యక్తులు బయటి సమాజంలో ఉండకూడదన్న అభిప్రాయాలు అప్పట్లో వెల్లువెత్తాయి.