కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలతో లీడర్స్ భేటీ, డేట్ ఫిక్స్, సీఎం తీరుపై అసంతృప్తి, సిద్దూ జోక్యం !
బెంగళూరు: ఇంతకాలం అధిష్టానం మీద అసమ్మతితో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక ముందు బహిరంగంగా వారి అసంతృప్తి వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. మే 21వ తేదీ కాంగ్రెస్ పెద్దలు అసమ్మతి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంత కాలం రహస్యంగా సమావేశాలు నిర్వహించిన అసమ్మతి ఎమ్మెల్యేలు త్వరలో జరిగే సమావేశంలో ఆ పార్టీ పెద్దల తీరుపై విరుచుకుపడే అవకాశం ఉందని సమాచారం.
సీఎం టార్గెట్
కుందగోళ, చించోళి శాసన సభల ఉప ఎన్నికలు ఈనెల 19వ తేదీ పూర్తి అవుతాయి. కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వం తీరుమీద, ముఖ్యంగా సీఎం కుమారస్వామి మీద ఈ సమావేశంలో బహిరంగంగా విమర్శలు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, బీడీఏ అధ్యక్షుడు ఎస్.టి. సోమశేఖర్ చిన్న క్లూ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధ్యక్షులుగా ఉన్న పలు నామినేటెడ్ శాఖల్లో అధికారులతో మా పనులను సీఎం కుమారస్వామి నియంత్రిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయని ఎస్.టి. సోమశేఖర్ ఆరోపించారు. ఈ సమావేశంలో ఈ విషయంపై చర్చించాలని అసమ్మతి ఎమ్మెల్యేలు తీర్మానించారని ఎస్.టి. సోమశేఖర్ అన్నారు.
సిద్దరామయ్య జోక్యం
ఇంతకు ముందు అసంతృప్తి వ్యక్తం చేసే ఎమ్మెల్యేల విషయంలో సిద్దరామయ్య జోక్యం చేసుకుని వారికి నచ్చచెప్పారని ఎస్.టి. సోమశేఖర్ అన్నారు. లోక్ సభ, శాసన సభ ఉప ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందని, త్వరలో అంతా సర్దుకుంటుందని సిద్దరామయ్య వారికి నచ్చచెప్పారని సోమశేఖర్ అన్నారు. లోక్ సభ ఎన్నికలు పూర్తి అయ్యాయని, ఉప ఎన్నికలు పూర్తి అయిన వెంటనే జరుగుతున్న సమావేశంలో కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతారో అంటూ అందరూ ఎదురుచూస్తున్నారని సోమశేఖర్ అన్నారు.
సీఎం, మాజీ సీఎం రహస్య భేటీ ?
హుబ్బళిలోని ఒక హోటల్ లో సీఎం కుమారస్వామి, మాజీ సీఎం సిద్దరామయ్య రహస్యంగా భేటీ అయ్యి అసమ్మతి ఎమ్మెల్యేలకు ఎలా నచ్చచెప్పాలి అనే విషయంలో చర్చలు జరుపుతున్నారని సమాచారం. శాసన సభ ఉప ఎన్నికలు పూర్తి అయిన వెంటనే అసమ్మతి ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి వారి సమస్యలు అడిగితెలుసుకోవాలని వారు నిర్ణయించారని తెలిసింది.
ఎమ్మెల్యేలతో భేటి
ఇంతకు ముందు నిర్ణయించిన శాసన సభ్యుల సమావేశం జరగలేదని, ఈసారి జరిగే సమావేశంలో అసమ్మతి నేతలు వారికి ఎదురౌతున్న సమస్యల గురించి చర్చించే అవకాశం ఉందని సోమశేఖర్ వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేరుకు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నారని, వారి పనులు మాత్రం జరగడం లేదని సోమశేఖర్ విచారం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం ధర్మాన్ని కాపాడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని, ఈ సమావేశంలో ఆ వివరాలు పార్టీ పెద్దల ముందు చెప్పే అవకాశం ఉందని ఆయన వివరించారు.