సస్పెన్స్, థ్రిల్లర్ రాజకీయాలు: బీజేపీ లెక్కలు, 8 మంది ఎమ్మెల్యేలు రెడీ, బళ్లారి రెడ్డి శిష్యులు!
Recommended Video
బెంగళూరు: కర్ణాటకలో ఎలాగైనా అధికారంలోకి రావడానికి బీజేపీ నాయకులు పక్కాప్లాన్ వేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలలోని అసమ్మతి నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ నాయకులు ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ నాయకుల లెక్కలు శనివారం సాయంత్రం 4 గంటలకు తారుమారు అవుతాయని జోస్యం చెబుతున్నారు. స్పీకర్ ఎంపికకు ముందు కొందరిని, బలపరీక్ష సమయంలో మరి కొందరిని తమవైపు లాగేసుకోవాలని బీజేపీ నాయకులు పక్కాప్లాన్ వేశారు. 8 మంది రెబల్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి శిష్యులు మద్దతు ఇస్తారని బీజేపీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
అనుమానం వస్తుంది !
బీఎస్. యడ్యూరప్ప ఇప్పటికే కొందరు స్వామీజీల సహాయంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన లింగాయుత ఎమ్మెల్యేలతో సంప్రధింపులు జరిపారని తెలిసింది. ఎమ్మెల్యేల అందరితో వారుకూడా రిసార్టు రాజకీయాలు చెయ్యకుంటే కాంగ్రెస్ అధిష్టానానికి అనుమానం వస్తుందని వారిని కూడా రిసార్టుకు పంపించారని సమాచారం.
స్పీకర్ మనవాడు !
శనివారం స్పీకర్ ఎంపీక సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ లోని కొందరిని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ నాయకులు ప్లాన్ వేశారు. అనంతరం తమవాడినే స్పీకర్ గా ఎంపిక చేసుకున్న తరువాత బలపరీక్ష సమయంలో చక్రం తిప్పాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.
ఎమ్మెల్యేలు సైలెంట్
యడ్యూరప్ప బలపరీక్ష నిరూపించుకునే సమయంలో కొందరిని తటస్టంగా చేసి మరికొందరితో మద్దతు తీసుకోవాలని బీజేపీ నాయులు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నాయకుల ధీమా చూస్తుంటే ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేల మద్దతు ఇస్తామని బలంగా యడ్యూరప్పకు హామీ ఇచ్చారని తెలిసింది.
బయటపడిన ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు హైదారాబాద్ వెళ్లలేదని సమాచారం. బళ్లారి జిల్లా విజయనగర శాసన సభ్యుడు ఆనంద్ సింగ్, మస్కి శాసన సభ్యుడు ప్రతాప్ గౌడ పాటిల్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హుమ్నాబాద్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ గురువారం రాత్రి బెంగళూరు శివార్లలోని రిసార్టు నుంచి బయటకు వెళ్లిపోయారు.
బళ్లారి రెడ్డి శిష్యులు
గాలి జనార్దన్ రెడ్డి శిష్యుడు, బళ్లారి గ్రామీణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగేంద్ర, అఫజల్ పూర్ ఎమ్మెల్యే ఎంవై. పాటిల్ బీజేపీకి అనుకూలంగా ఓటు వెయ్యడానికి సిద్దంగా ఉన్నారని తెలిసింది. ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్, హైదరాబాద్ వెళ్లని ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరి కొందరు బీజేపీకి మద్దతు ఇస్తామని బీఎస్. యడ్యూరప్పకు హామీ ఇచ్చారని తెలిసింది.