ఎన్నికల ఫలితాలు, బీజేపీకి సంకీర్ణ ప్రభుత్వం దెబ్బ, పొత్తు ఉండదు, మాజీ ప్రధాని!
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సోమవారం సాయంత్రం ప్రకటించారు. కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో 105 చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మూడు కార్పొరేషన్లతో పాటు సిటీ మునిసిపాలిటీలు, పట్టణ మునిసిపాలిటీలు, పట్టణ పంచాయితీల ఎన్నికలు ఆగస్టు 31వ తేదీన జరిగాయి. సెప్టెంబర్ 3వ తేదీన ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ రెండవ స్థానానికి పరిమితం అయ్యింది. బీజేపీతో పొత్తు ఉండదని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ స్పష్టం చేశారు.
మూడు కార్పొరేషన్లు
మైసూరు, శివమొగ్గ, తుమకూరు నగరాలలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. శివమొగ్గలో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మేయర్ పీఠం మీద ఆ పార్టీ నాయకులను కుర్చోపెట్టడానికి సిద్దం అయ్యింది. ఇక మైసూరు, తుమకూరులో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మైసూరు, తుమకూరులో మళ్లీ పొత్తు పెట్టుకోవడానికి సిద్దం అవుతోంది.
బీజేపీ కింగ్, అధికారం లేదు !
రాచనగరి మైసూరు నగరం కార్పొరేషన్ లో 65 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. బీజేపీ 22 వార్డుల్లో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 19 వార్డులు, జేడీఎస్ 18 వార్డులు, బీఎస్పీ 1, స్వతంత్ర అభ్యర్థులు 5 మంది విజయం సాధించారు. అధిక స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీని దూరం పెట్టి అధికారంలోకి రావాలని కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది. మైసూరులో ఎవరు అధికారంలోకి రావాలన్నా 33 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం.
ఎవరి బలం ఎంత అంటే !
మూడు కార్పొరేషన్లలోని 135 వార్డుల్లో బీజేపీ 54, కాంగ్రెస్ 36, జేడీఎస్ 30, ఇతరులు 12 మంది విజయం సాధించారు. 926 సిటీ మునిసిపాలిటీ వార్డుల్లో బీజేపీకి 355, కాంగ్రెస్ కు 294, జేడీఎస్ కు 107, ఇతరులు 170 మంది విజయం సాదించారు. 1,247 పట్టణ మునిసిపాలిటీ వార్డుల్లో కాంగ్రెస్ కు 532, బీజేపీకి 389, జేడీఎస్ కు 211, ఇతరులు 115 మంది విజయం సాధించారు. 358 పట్టణ పంచాయితీ వార్డుల్లో కాంగ్రెస్ 141, బీజేపీ 129, జేడీఎస్ 29, ఇతరులు 59 మంది విజయం సాధించారు.
బీజేపీకి సంకీర్ణం దెబ్బ !
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉందని, అందుకోసం తాము ఊహించని దానికంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోలేకపోయామని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు, మాజీ మఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మీడియాతో అన్నారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్న చోట అధికారంలో ఉంటామని మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప స్పష్టం చేశారు.
మాజీ ప్రధాని క్లారిటీ
మైసూరు నగర కార్పొరేషన్ లో గతంలో బీజేపీ-జేడీఎస్ పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారం దూరం చేశాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల విడుదల తరువాత మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మీడియాతో మాట్లాడాుతూ ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోమని అన్నారు. అవసరం అయితే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని, మాకు బలం ఉన్న చోట మద్దతు ఇవ్వమని ఆ పార్టీని కోరుతామని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అంటున్నారు.