షాక్: లోకాయుక్త జడ్జికి మూడు కత్తిపోట్లు, సీరియస్, సీఎం పరుగు, బీజేపీ ఫైర్, శాంతిభద్రతలు !
బెంగళూరు: నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉండే లోకాయుక్త న్యాయస్థానంలో న్యాయమూర్తి మీద హత్యాయత్నం జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని విదాన సౌధ, వికాస సౌధ పక్కనే ఉన్న లోకాయుక్త కార్యాలయంలోని న్యాయస్థానంలో న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి మీద కత్తితో మూడుసార్లు దాడి చేశారు. తీవ్రగాయాలైన న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి మాల్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
నిందితుడి ఎంట్రీ
మంగళవారం మద్యాహ్నం 1.40 గంటల సమయంలో కర్ణాటకలోని తుమకూరుకు చెందిన తేజస్ శర్మా అనే వ్యక్తి లోకాయుక్త కార్యాలయంలోకి వెళ్లాడు. తరువాత లోకాయుక్త న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి కార్యాలయం దగ్గర నిలబడ్డాడు.
భోజనం చెయ్యడానికి జడ్జి
లోకాయుక్త కోర్టులో నుంచి న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి భోజనం చెయ్యడానికి ఆయన కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడే మకాం వేసిన తేజస్ శర్మా ఒక్కసారిగా కార్యాలయంలోకి వెళ్లి విశ్వనాథ్ శెట్టి మీద కత్తితో దాడి చేశాడు.
మూడు కత్తిపోట్లు
రక్తం కారుతున్న సమయంలోనే మరో రెండుసార్లు న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి మీద దాడి చేశాడు. చాతి, కడుపులో మూడు కత్తిపోట్లు పడటంతో గట్టిగా కేకలు వేసిన విశ్వనాథ్ శెట్టి కుప్పకూలిపోయారు. న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి మీద హత్యాయత్నం చేసిన తేజస్ శర్మా అక్కడి నుంచి పారిపోవడానికి విఫలయత్నం చేశాడు.
తేజస్ కు దేహశుద్ది
తేజస్ శర్మాను పట్టుకున్న లోకాయుక్త కార్యాలయం సిబ్బంది అతనికి దేహశుద్ది చేసి విదాన సౌధ పోలీసులకు అప్పగించారు తీవ్రగాయాలైన న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టిని మాల్యా ఆసుపత్రికి తరలించారు. న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
సీఎం, మంత్రులు పరుగు
లోకాయుక్త న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి మీద హత్యాయత్నం జరిగిందని తెలుసుకున్నసీఎం సిద్దరామయ్య, హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి, మంత్రులు కేజే. జార్జ్, ఎంబీ. పాటిల్ తదితరులు మాల్యా ఆసుపత్రి చేరుకున్నారు. లోకాయుక్త న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని సీఎం సిద్దరామయ్య మాల్యా ఆసుపత్రి వైద్యులను అడిగితెలుసుకున్నారు.
మెటల్ డిటెక్టర్
లోకాయుక్త కార్యాలయం ప్రవేశ ద్వారంలో మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. లోకాయుక్త కార్యాలయంలోకి వెళ్లే ప్రతి ఒక్కరూ అక్కడికి ఎందుకు వెళ్లాము అని రిజిస్టర్ లో వివరాలు నమోదు చేసి సంతకం చెయ్యాలి. తేజస్ శర్మా తాను న్యాయవాది అని రిజిస్టర్ లో రాశాడు. అయితే తేజస్ శర్మా కత్తితో ఎలా లోపలికి వెళ్లాడు అనే విషయం అంతుచిక్కడం లేదని పోలీసులు అంటున్నారు.
జడ్జికే భద్రత లేదని బీజేపీ ఫైర్
లోకాయుక్త న్యాయమూర్తికి ఆయన కార్యాలయంలోనే భద్రత లేకుండాపోయిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని, కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు.