కర్ణాటకను మహారాష్ట్రలో కలిపేస్తారా? -ఇంచు కూడా ఇవ్వం: ఠాక్రేపై యడ్డీ ఫైర్ -ముదిరిన సరిహద్దు వివాదం
కర్ణాటక - మహారాష్ట్ర మధ్య ఏళ్లుగా నానుతోన్న సరిహద్దు వివాదం మరోసారి తెరపైకొచ్చింది. ఈసారి ముఖ్యమంత్రులే నేరుగా వాగ్వాదానికి దిగడంతో వివాదంపై వేడి పెరుగుతున్నది. కర్ణాటకలో మరాఠా మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేసుకుంటామని మహాసీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేయగా, తమ వైపు నుంచి ఇంచు భూమిని కూడా ఇవ్వబోమంటూ కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప కౌంటర్ వేశారు. ఈ సందర్భంగా పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి తీరుపై యడ్డీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..
'కర్ణాటక'ను మహారాష్ట్రలో కలిపేస్తాం -సీఎం ఉద్ధవ్ సంచలనం -మళ్లీ తెరపైకి బెల్గామ్ సరిహద్దు వివాదం
ఉద్ధవ్ సంచలన ప్రకటన..
కర్ణాటక - మహారాష్ట్ర మధ్య చాలా ఏళ్లుగా సరిహద్దు వివాదం కొనసాగుతున్నా, రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు మాత్రమే నేతలు దానిని తెరపైకి తెస్తుంటారు. బీజేపీని ధీటుగా ఎదుర్కొనే క్రమంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మరోసారి సరిహద్దు వివాదాన్ని తట్టిలేపారు. కర్ణాటక ఆక్రమించిన మరాఠ మాట్లాడే ప్రాంతాలను తిరిగి తమ రాష్ట్రంలో తిరిగి కలుపుకుంటామంటూ ఆదివారం సంచలన ప్రకటన చేశారు ఉద్ధవ్. ''కర్ణాటక ఆక్రమించిన మహారాష్ట్ర భాషా, సంస్కృతితో ముడిపడి ఉన్న ప్రాంతాలను వెనక్కు తెస్తాం. సరిహద్దు వివాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఇదే తామిచ్చే నిజమైన నివాళి. ఇందుకోసం ఐక్యంగా కట్టుబడి పనిచేస్తాం. అమరుల గౌరవార్థం ఇదే వారికి మా వాగ్దానం'' అని మహా సీఎంవో ట్వీట్లు చేసింది. దీనిపై..
యడ్డీ కౌంటర్.. ఇంచు భూమి కూడా..
కర్ణాటక ఆక్రమణలోని మరాఠా ప్రాంతాలను కలిపేసుకుంటామంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ చేసిన కామెంట్లపై కన్నడ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తీవ్రంగా స్పందించారు. కర్ణాటక వైపు నుంచి ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని యడ్డీ స్పష్టం చేశారు. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించడం దురదృష్టకరమని సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ యడియూరప్ప ఈ మాటలు అన్నారు. కాగా..
కన్నడ-మరాఠా మధ్య ఏమిటీ వివాదం?
ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉన్న బెల్గాం తదితర సరిహద్దు ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు చాలా మంది ఉన్నారు. అప్పట్లో ఈ ప్రాంతాలు 'మద్రాస్ ప్రెసిడెన్సీ' ఏలుబడిలో ఉండేవి. అయితే ఆ ప్రాంతాలు మహారాష్ట్రకు చెందినవేనని, వాటిని మహారాష్ట్రలో కలపాలని మహారాష్ట్ర ఏకీకరణ సమితి సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తోంది. 1956 జనవరి 17న జరిగిన ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు విడిచారు. అప్పటినుంచి జనవరి 17న మరాఠా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం ఉద్ధవ్ థాకరే కార్యాలయం తాజా ట్వీట్ చేసింది. కర్ణాటక అధీనంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలపడమే అమరవీరులకు తాము అందించే ఘన నివాళి అని పేర్కొంది. దీనిపై యడియూరప్ప సోమవారం సూటిగా స్పందిస్తూ, కర్ణాటకలోని ఒక్క అంగుళం కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు.
సుప్రీం పరిధిలో బెల్గాం బోర్డర్ వివాదం
బెల్గాం సరిహద్దు వివాదంగా ప్రాచుర్యం పొందిన ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. కేసు విచారణ ఏళ్లుగా పెండింగ్ లో ఉండగా.. దాన్ని కదిలించే ప్రక్రియ కోసం, కోర్టు సంబంధ విషయాలను పర్యవేక్షించేందుకు మహా సీఎం ఉద్దవ్.. మంత్రులు ఏక్నాథ్ షిండే, ఛాగన్ భుజ్బల్లతో గతేడాది ఓ కమిటీ వేశారు. కోర్టు తీర్పు కంటే ముందే రెండు రాష్ట్రాల సీఎంలు నేరుగా మాటల యుద్ధానికి దిగడం రాజకీయంగా దుమారం రేపుతున్నది.
కొంపముంచిన పరిశోధన -గబ్బిలాల గుహకు చైనా శాస్త్రవేత్తలు -అక్కడే కరోనాకు బీజం