నేను పుట్టపర్తి సత్య సాయి బాబా పునర్జన్మ
బెంగళూరు: సత్య సాయిబాబా పునర్జన్మ తానేనని, బాబా వారసుడు నేనే అంటూ కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ప్రచారం చేసుకుంటున్నాడు. బెంగళూరు-బళ్లారి రోడ్డులోని చిక్కబళ్లాపురం సమీపంలోని ముద్దేనహళ్లికి చెందిన మధుసూదన్ నాయుడు అనే వ్యక్తి ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు.
ప్రతి రోజు సత్యసాయి బాబా తన కలలోకి వస్తుంటారని, తాను ఏమి చెయ్యాలో బాబానే వివరిస్తారని అంటున్నారు. తన జయంతి వేడుకలు సైతం భారీ ఎత్తున చెయ్యాలని బాబానే తనకు కలలో చెప్పారని చెబుతున్నారు.
సత్యసాయి బాబా 90వ జయంతి వేడుకలు ఈ నెల 24వ తేదిన భారీ ఎత్తున చెయ్యాలని బాబా భక్తులు భావిస్తున్న సమయంలో మధుసూదన్ నాయుడు పునర్జన్మ వాదనలు తెరమీదకు తీసుకురావడం విశేషం.
మధుసూదన్ నాయుడు చేస్తున్న అసత్య ప్రచారంపై పుట్టపర్తి సత్య సాయిబాబ ట్రస్టు సభ్యులు, బాబా భక్తులు మండిపడుతున్నారు. కర్ణాటకకు చెందిన కొందరు కావాలనే పవిత్రమైన పుట్టపర్తి ప్రాధాన్యాన్ని మంటగలిపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
2011లో సత్యసాయి బాబా మరణించిన విషయం తెలిసిందే. తరువాత విదేశీ భక్తులతో పాటు భారతదేశంలోని వివిద ప్రాంతాల నుంచి పుట్టపర్తికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
సత్యసాయి బాబా జీవించి ఉన్న సమయంలో విదేశీ భక్తులతో పాటు భారతదేశానికి చెందిన వివిద ప్రాంతాల నుంచి లక్షల మంది పుట్టపర్తికి వచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ సంఖ్య వేలలోకి పడిపోయింది.
సత్యసాయి బాబా ట్రస్టుకు రూ. 1,500 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లు ఉన్నాయని, సంవత్సరానికి రూ. 120 కోట్లు వడ్డికిందనే వస్తుందని, ఏడాదికి రూ. 60 కోట్ల వరకు విరాళాలు వస్తాయని బాబా భక్తులు అంటున్నారు. పుట్టపర్తి పవిత్రతను దెబ్బతియ్యడానికి ఈ విదంగా అసత్య ప్రచారం చేస్తున్నారని బాబా భక్తులు మండిపడుతున్నారు.