అనాథను అంగరంగ వైభవంగా పెళ్లాడిన యువకుడు
ధార్వాడ: అనాథలంటే సమాజంలో చిన్నచూపు చూస్తారు. అనాథాశ్రమంలో పెరిగిన పిల్లలను కనీసం ఆదరించడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపరు. పంద్రాగస్టు వంటి జాతీయ పర్వదినాల్లో జెండా ఎగుర వేసి, చాక్లెట్లను పంచుతారు. అంతటితో వారి గురించి మరిచిపోతారు.
చంద్రబాబు, వైఎస్ జగన్ ఇళ్లకు రెండంచెల భద్రత!
దీనికి భిన్నంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. ఏరికోరి ఓ అనాథ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. బాల్యం నుంచీ అనాథాశ్రమంలో పెరిగిన యువతిని ఇష్టపడి మరీ మనువాడాడు.
కర్ణాటకలోని ధార్వాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువకుడి పేరు శ్రీనివాస్ దేశ్పాండే. స్థానికంగా ఓ మొబైల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆకర్షణీయమైన జీతాన్ని అందుకున్నాడు. ఓ అనాథను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం బెళగావిలోని గంగమ్మ చిక్కుంబిమఠ అనాథల ఆశ్రమాన్ని సంప్రదించాడు. ఆ ఆశ్రమంలో తలదాచుకుంటున్న ఆరతి పురాణిమఠ అనే యువతిని ఇష్టపడ్డాడు. ఆమె గురించి ఆరా తీశాడు.
మహారాష్ట్రకు చెందిన ఆరతికి రెండేళ్ల ప్రాయంలో తండ్రి చనిపోయాడు. పదేళ్లు వచ్చేటప్పటికీ తల్లి కూడా మరణించారు. దగ్గరి బంధువులు ఎవరూ పట్టంచుకోలేదు. దీనితో ఆరతి బెళగావిలోని చిక్కుంబిమఠ అనాథ ఆశ్రమాన్ని ఆశ్రయించారు. అక్కడే నివసిస్తున్నారు.
తన కుటుంబ సభ్యులను వెంట బెట్టుకుని కొద్దిరోజుల కిందట శ్రీనివాస్ దేశ్పాండే ఆశ్రమ నిర్వాహకులను కలిశారు. శ్రీనివాస్ గురించి అన్ని వివరాలను కూడా తెలుసుకున్న తరువాత పెళ్లికి అంగీకరించారు. ధార్వాడలోని ప్రాణదేవర ఆలయంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు.