పారిపోయి హైదరాబాద్ వచ్చిన కన్నడ మంత్రి మేనల్లుడు: అసలేం జరిగిందంటే?
కర్ణాటక రాష్ట్రం బీదర్లో గురువారం కనిపించకుండా పోయిన ఆ రాష్ట్ర మంత్రి మేనల్లుడితోపాటు ముగ్గురు చిన్నారుల ఆచూకీ నగరంలో లభ్యమైంది.
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రం బీదర్లో గురువారం కనిపించకుండా పోయిన ఆ రాష్ట్ర మంత్రి మేనల్లుడితోపాటు ముగ్గురు చిన్నారుల ఆచూకీ నగరంలో లభ్యమైంది. హైదరాబాద్ సుల్తాన్బజార్ పోలీసుల చొరవతో ఆ ముగ్గురు పిల్లలు సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు.
ఇంట్లో చెప్పకుండా పరార్..
పారిపోయిన వారిలో కర్ణాటక పురపాలకశాఖ మంత్రి ఈశ్వర్కు మేనల్లుడు లక్ష్(9) కూడా ఉన్నాడు. ఇతడు బీదర్లోని ఓపాఠశాలలో 5వతరగతి చదువుతున్నాడు. కాగా, ఆగస్టు 31న సాయంత్రం లక్ష్, అతడి స్నేహితులు కరణ్ (8), వినీత్ (10)తో కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేశారు. వారి తలిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీదర్ నుంచి కోఠికి...
ఈ ముగ్గురు శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ కోఠిలోని ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్ద ఓ వినాయక మండపం వద్ద తచ్చాడారు. వీరిని గమనించిన ఓ వ్యక్తి సుల్తాన్బజార్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ముగ్గురినీ స్టేషన్కు తీసుకువచ్చారు. ఏసీపీ చక్రవర్తి, డీఐ వంశీకృష్ణరావు, ఎస్సై నర్సింగ్రావు చిన్నారుల వివరాలను తెలుసుకున్నారు.
ఎలా వచ్చారంటే..
బీదర్లో గురువారం రాత్రి బస్సులో బయలుదేరి నగరంలోని ఎంజీబీఎస్కు చేరుకున్నామని, నడుచుకుంటూ కోఠీకి వచ్చినట్లు తెలిపారని ఏసీపీ వివరించారు. .
చిన్నారుల విషయాన్ని కర్ణాటక పోలీసులకు, మంత్రి ఈశ్వర్కు తెలిపారు ఏసీపీ. వెంటనే సదరు మంత్రి బీదర్ నుంచి శుక్రవారం ఉదయం సుల్తాన్బజార్స్టేషన్కు వచ్చారు. పోలీసులు ఆయనకు ముగ్గురు చిన్నారులను అప్పగించారు.
మంత్రి రూ.20వేలను తిరస్కరించిన పోలీసులు
కాగా, పిల్లల్ని క్షేమంగా అప్పగించినందుకు ఈశ్వర్ సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్కు రూ.20 వేలు ఇవ్వగా పోలీసు అధికారులు సున్నితంగా తిరస్కరించారు. దీంతో తమ పిల్లలను కాపాడిన పోలీసులకు రివార్డు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తానని మంత్రి ఈశ్వర్ తెలిపారు. ఆ తర్వాత తనతోపాటు ముగ్గురు పిల్లలను ఆయన తీసుకెళ్లారు.