బళ్లారి రెడ్డి బ్రదర్స్ దెబ్బ: ప్రైవేటు విమానంలో పారిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, రెండు విక్కెట్లు !
బెంగళూరు: బళ్లారి రెడ్డి బ్రదర్స్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రైవేటు విమానంలో గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పారిపోయాడని వెలుగు చూడటంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైయ్యింది. కర్ణాటకలోనే పేద ఎమ్మెల్యే గా పేరు తెచ్చుకున్న ప్రతాప్ గౌడ పాటిల్ ప్రైవేటు విమానంలో ఎలా వెళ్లారు అనే విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.
రిసార్టు నుంచి మాయం
కర్ణాటకలోని మస్కి శాసన సభ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రతాప్ గౌడ పాటిల్ బుధవారం రాత్రి బెంగళూరు నగర శివార్లలోని బిడది సమీపంలోని ఈగల్టన్ రిసార్టు నుంచి మాయం అయ్యారు. ప్రతాప్ గౌడ పాటిల్ కోసం కాంగ్రెస్ నాయకులు గాలించారు.
ప్రైవేట్ విమానంలో పరార్
మస్కి శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే కోసం కాంగ్రెస్ నాయకులు గాలించినా ఫలితం లేకపోయింది. చివరికి బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి ప్రైవేటు విమానంలో మస్కి ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయారని వెలుగు చూసింది.
ఎమ్మెల్యే ఆస్తులు
2013 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతాప్ గౌడ పాటిల్ తన ఆస్తుల విలువ రూ. 40 లక్షలు అని ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. 2018 ఎన్నికల్లో తన ఆదాయం రూ. 17.50 లక్షలు అని, స్థిర, చర ఆస్తుల విలువ రూ. 5.5 కోట్లు, భార్య పద్మావతి ఆస్తులు రూ. 58. 8 లక్షలు అని ఎన్నికల సంఘంకు అఫిడవిట్ సమర్పించారు.
213 ఓట్ల మెజారిటీ
2018 శాసన సభ ఎన్నికల్లో మస్కి నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ప్రతాప్ గౌడ పాటిల్ 60, 387 ఓట్లు సంపాధించారు. ప్రతాప్ గౌడ పాటిల్ ప్రత్యర్థి బసవనగౌడ తురువినాళకు 60,174 ఓట్లు వచ్చాయి. మస్కి నియోజక వర్గంలో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతాప్ గౌడ పాటిల్ కేవలం 213 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారు.
రెడ్డి బ్రదర్స్ దెబ్బ
2013,2018లో మస్కి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ పై ప్రతాప్ గౌడ పాటిల్ ఎమ్మెల్యే అయ్యారు. 2008లో బీజేపీ టిక్కెట్ మీద ప్రతాప్ గౌడ పాటిల్ ఎమ్మెల్యే అయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, బళ్లారి బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి హెచ్ఏఎల్ విమానాశ్రయానికి ప్రైవేటు విమానం పంపించి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ పారిపోవడానికి సహకరించారని తెలిసింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ ఆ పార్టీకి దూరం అయ్యారు.