మంత్రి డీకే శివకుమార్ అరెస్టు: సర్ చాలు రండి, ముంబైలో దిక్కుతోచని స్థితిలో లీడర్స్ !
ముంబై: కర్ణాటక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి వెళ్లిన ఆ రాష్ట్ర మంత్రి, ట్రుబుల్ షూటర్ డీకే. శివకుమార్ ను ముంబై పోలీసులు అరెస్టు చేసి రహస్య ప్రాంతానికి తరలించారు. రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన స్టార్ హోటల్ ముందు 144 సెక్షన్ అమలులో ఉన్నందున అక్కడ ధర్నా చేస్తున్న మంత్రి డీకే. శివకుమార్ ను ముంబై పోలీసులు అరెస్టు చెయ్యడంతో ఆయన వెంట వెళ్లిన నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
బుదవారం ఉదయం 8.15 గంటల నుంచి హోటల్ ముందు మంత్రులు డీకే శివకుమార్, జీటీ దేవేగౌడ, ఎమ్మెల్యేలు శివలింగేగౌడ, బాలక్రిష్ణ మకాం వేశారు. హోటల్ లోకి పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడే డీకే శివకుమార్ తోపాటు మిగిలిన కర్ణాటక నాయకులు అక్కడే టిఫిన్, భోజనాలు చేశారు.
తమను బెదిరించడానికి డీకే శివకుమార్ ఇక్కడికి వచ్చారని, ఆయన్ను హోటల్ లోకి అనుమతించరాదని, తమకు రక్షణ కల్పించాలని రెబల్ ఎమ్మెల్యేలు ముంబై నగర పోలీసు కమిషనర్ కు మనవి చేశారు. రెబల్ ఎమ్మెల్యేల ఫిర్యాదుతో హోటల్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాను ఎమ్మెల్యేలతో మాట్లాడిన తరువాతే ఇక్కడి నుంచి వెలుతానని డీకే. శివకుమార్ పట్టుబట్టి అక్కడే కుర్చున్నారు. సుమారు 200 మంది పోలీసులు హోటల్ ముందు బందోబస్తులో పాల్గొన్నారు. బుదవారం మద్యాహ్నం ఒక్కసారిగా పోలీసులు డీకే శివకుమార్ ను అరెస్టు చేశారు.
పక్క రాష్ట్రానికి చెందిన మంత్రిని అరెస్టు చెయ్యడంతో అక్కడే ఉన్న ముంబై కాంగ్రెస్ నాయకులు షాకు గురైనారు. డీకే శివకుమార్, ముంబై కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు అక్కడే ఉన్న కర్ణాటక మంత్రి జీటీ. దేవేగౌడ, ఎమ్మెల్యేలు శివలింగేగౌడ, బాలక్రిష్ణను అక్కడే వదలిపెట్టి రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. డీకే శివకుమార్ ను అరెస్టు చెయ్యడంతో ఆయన వెంట ముంబై వెళ్లిన నాయకులు ఆందోళనకు గురై హోటల్ ముందు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు.