మంత్రి వర్గం: ఆహ్వానం లేదు, బాంబు పేల్చిన డీకే శివకుమార్, నా మ్యాచ్ కు ప్రత్యేక ఫలితం!
బెంగళూరు: జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మంత్రి వర్గం ఏర్పాటు విషయంలో చర్చించడానికి తనను ఎవ్వరూ ఆహ్వానించలేదని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శుక్రవారం బాంబు పేల్చారు. తనను చర్చలకు ఆహ్వానించి ఉంటే కచ్చితంగా వెళ్లేవాడినని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. బెంగళూరు నగరంలోని సదాశివనగర్ నివాసంలో డీకే. శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తనది ప్రత్యేకమైన మ్యాచ్ అని, దానికి ఫలితం ప్రత్యేకంగా ఉంటుందని, అది మీరే చూస్తారని అన్నారు.
సంకీర్ణంలో కీలకనేత
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లకుండా డీకే. శివకుమార్ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంలో డీకే. శివకుమార్ కీలక మలుపులు తిప్పి బీజేపీ నాయకులకు సినిమా చూపించారు.
ఇచ్చినా, ఇవ్వకపోయినా !
తనకు మంత్రి పదవి ఇచ్చినా ఒక్కటే, ఇవ్వకపోయినా ఒక్కటే అని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 78 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తాను ఒక్కడిగా ఉంటానని, తనకు ఎలాంటి సమస్య లేదని డీకే. శివకుమార్ బాంబుపేల్చారు.
సీఎం సోదరుడితో పోలిక
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి హెచ్.డి. రేవణ్ణ, డీకే శివకుమార్ ఒకే శాఖ కావాలని పట్టుబడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై మాట్లాడిన డీకే శివకుమార్, హెచ్.డి. రేవణ్ణ లాంటి సీనియర్లతో తనకు పోలిక ఏమిటని, తనకు అధికారం ఇచ్చినా ఒక్కటే ఇవ్వకపోయినా ఒక్కటే అని డీకే. శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీబీఐ టార్గెట్ అతనే
గురువారం సీబీఐ అధికారులు బెంగళూరు, రామనగర, కనకపుర తదితర ప్రాంతాల్లో డీకే. శివకుమార్, డీకే. సురేష్ సోదరుల అనుచరుల నివాసాల మీద దాడులు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారులు తన తమ్ముడు డీకే. సురేష్ పేరు చెప్పాలని ఒత్తిడి చేశారని డీకే శివకుమార్ ఆరోపించారు.
బీజేపీ నాయకులు
తన తమ్ముడు డీకే. సురేష్ ను ఎలాగైనా కేసుల్లో ఇరికించాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఒక లోక్ సభ సభ్యుడి మీద ఇలా చెయ్యడం మంచిదికాదని డీకే. శివకుమార్ అన్నారు. యడ్యూరప్పకు తన మీద ప్రేమ ఎక్కువ కావడం వలనే ఇలా దాడులు జరుగుతున్నాయని, తాము ఏతప్పూ చెయ్యలేదని, ఎవ్వరికీ భయపడమని డీకే. శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు.