తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: త్రిబుల్ షూటర్ ఎంట్రీ, నేతలతో చర్చలు, బళ్లారి ప్లాన్ అమలు!
బెంగళూరు/హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కర్ణాకకు చెందిన త్రిబుల్ షూటర్ ను పంపించడానికి ఆ పార్టీ హైకమాండ్ సిద్దం అయ్యింది. ఇప్పటికే తెలంగాణకు చెందిన అసమ్మతి నేతలతో త్రిబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ చర్చలు జరిపారని ఢిల్లీ నాయకులు అంటున్నారు. బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల ప్లాన్ ను తెలంగాణలో అమలు చెయ్యాలని డీకే. శివకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్ హైకమాండ్
తెలంగాణ శాసన సభ ఎన్నికల పోలింగ్ 2018 డిసెంబర్ 7వ తేదీ జరుగనుంది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కలిసి మహా కూటమిగా ఎన్నికల బరిలోకి తిగుతున్నాయి. మిత్రపక్షాలకు కేటాయించిన నియోజక వర్గాల్లో పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం లేకుండా పోయింది. అలాంటి నియోజక వర్గాల్లోని అసమ్మతి నాయకులను కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగిస్తోంది.
డీకే శివకుమార్ ఎంట్రీ
తెలంగాణలో అసమ్మతి నేతలతో చర్చించాలని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ కు సూచించింది. హైకమాండ్ ఆదేశాలతో డీకే. శివకుమార్ ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. వారి సమస్యలు పరిష్కరించి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నత స్థాయి పదవులు అప్పగిస్తామని డీకే. శివకుమార్ వారికి మాట ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
త్రిమూర్తులు
తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకుల జాబితాను విడుల చేసిన వెంటనే అసమ్మతి నేతల తీరుతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తలలు పట్టుకుంది. అసమత్మి నేతలకు నచ్చ చెప్పడానికి ముగ్గురు నాయకులతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రత్యేకంగా ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ సభ్యులు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలలో చర్చలు జరిపి వారిని ఓ దారికి తీసుకు వచ్చారు..
రాజకీయ చాణుక్యుడు
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రిగా పని చేస్తున్న డీకే. శివకుమార్ కు హైకమాండ్ దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరికీ డీకే. శివకుమార్ తెలుసు. తెలంగాణ అసమ్మతి నేతలను భుజ్జగించే ప్రత్యేక కమిటీలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. తెలుగు బాష మీద మంచి పట్టు ఉన్న కర్ణాటక సీనియర్ మంత్రి డీకే. శివకుమార్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయస్వామి, పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణరావ్ పేర్లు ఆ కమిటీలో ఉన్నాయి.
త్రిబుల్ షూటర్
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడంలో డీకే. శివకుమార్ కీలక పాత్ర పోషించాడు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ కాకుండా డీకే. శివకుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలను ఏకం చేసి వారిని రిసార్టుకు తరలించే భాద్యతను పూర్తిగా డీకే శివకుమార్ కు అప్పగించారు. హైకమాండ్ ఆదేశాలను డీకే. శివకుమార్ పక్కాగా పాటించారు.
ఐటీ దాడులు
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో తన మీద ఐటీ దాడులు జరిగినా డీకే. శివకుమార్ భయపడలేదు. బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల భాద్యతను అప్పగించడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉగ్రప్పను భారీ మొజారిటీతో గెలిపించుకుని హైకమాండ్ కు మరింత దగ్గర అయ్యాడు. తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారం భాద్యతల్లో భాగంగా కర్ణాటక నుంచి ఇద్దరు నేతలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పంపించడానికి సిద్దం అయ్యింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, సీనియర్ మంత్రి డీకే. శివకుమార్ తెలంగాణలో జరుగుతున్న శాసన సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.