అంబరీష్ వైద్యఖర్చులు కోటి: ప్రభుత్వం చెల్లింపుపై రగడ
బెంగళూరు: కన్నడ సినీ నటుడు, కర్ణాటక రాష్ట్ర మంత్రి అంబరీష్ తన వైద్య ఖర్చుల కోసం ఒక కోటి రూపాయలకుపైగా విదేశంలోని ఓ ఆస్పత్రికి చెల్లించారు. తన ఫ్యామిలీ, వైద్యుల ప్రయాణ ఖర్చులు, సింగపూర్లో వైద్య చేయించుకున్న మౌంట్ ఎలిజబెత్ మెడికల్ సెంటర్లో అయిన వైద్య ఖర్చులు మొత్తం కలిసి రూ. 1.16 కోట్లుగా మంత్రి అంబరీష్ క్లెయిమ్ చేశారు.
కాగా, దీనిపై ప్రతిపక్షాలతోపాటు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఏ విధంగా క్లెయిమ్ చేస్తుందని, ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఇటీవల ఆయన తన ఆస్తులు రూ. 4.3 కోట్లుగా చూపించారు.
కాగా, శాసనసభ్యులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందితే ప్రభుత్వం తరపు రూ. 7లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ, ఇది ప్రత్యేక కేసుగా భావించి ప్రభుత్వం తరపున అంబరీష్కు సంబంధించిన వైద్య ఖర్చులను(రూ. కోటి) క్లెయిమ్ చేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య స్పష్టం చేశారు.
సామాన్యులకు ఏవైనా ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తారు.. రాష్ట్ర మంత్రులకు మాత్రం విదేశాల్లో వైద్య సేవలు అందించి, వాటికి ఖర్చులు కూడా చెల్లిస్తారా అని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ సూచన మేరకే తాను మెరుగైన వైద్యం కోసం సింగపూర్కు వెళ్లానని అంబరీష్ తెలిపారు. 2011లో రజనీకాంత్ తనకు ఆరోగ్య సమస్య వస్తే అక్కడికే వెళ్లి వైద్యం చేసుకున్నారని చెప్పారు. కాగా, తనకు బెంగళూరు ఆస్పత్రిలో అయిన రూ. 5 లక్షల రూపాయలను కూడా క్లెయిమ్ చేయాలని అంబరీష్ కోరినట్లు తెలిసింది. ఈ ఖర్చులకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.