వరద బాధితులకు బిస్కెట్లు విసిరేసిన సీఎం సోదరుడు, మంత్రి, బిక్షగాళ్లు వస్తే, ఛీ !
బెంగళూరు: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లోని ప్రజలను సహాయక శిభిరాలకు తరలిస్తున్నారు. వరదల తాకిడికి సహాయక శిభిరాలకు తరలి వెళ్లిన ప్రజలు ఆహారం, మంచి నీళ్లు, దుస్తుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే స్వయానా సీఎం హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, మంత్రి హెచ్.డి. రేవణ్ణ వరద బాధితుల పట్ల ప్రవర్తించిన తీరు చూసి అనేక మంది ఛీకొడుతున్నారు. మీరు సహాయం చెయ్యడానికి వెళ్లారా ? అసలు మనిషిగా ప్రవర్తించారా ? అంటూ సోషల్ మీడియాలో ఛీకొడుతూ ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.
జిల్లా సహాయక శిభిరం
కర్ణాటకలోని కొడుగు, హాసన్, మైసూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలతో స్థానికులు నానా తంటాలు పడుతున్నారు. వరద బాధితులను రక్షించి సహాయక శిభిరాలకు తరలిస్తున్నారు. సహాయక శిభిరాల్లోని బాధితులు ఆహారం, మంచి నీళ్లు, దస్తుల కోసం ఎదురు చూస్తున్నారు.
సీఎం సోదరుడు, మంత్రి
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సొంత సోదరుడు, హాసన్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి హెచ్.డి. రేవణ్ణ, ఎమ్మెల్యే ఏటీ. రామస్వామి, అధికారులు అరకలగూడు తాలుకాలోని రామనాథపురంలో ఏర్పాటు చేసిన సహాయక శిభిరం దగ్గరకు వెళ్లారు. మంత్రి రేవణ్ణ, ఎమ్మెల్యే ఏటీ. రామస్వామి, అధికారులను చూసిన వరద బాధితులు తమను ఆదుకోవడానికి వచ్చారని కొంత సేపు సంబరపడిపోయారు.
ఇంత చులకనగా చూడాలా ?
సహాయక శిభిరానికి వెళ్లిన సీఎం సోదరుడు, మంత్రి హెచ్.డి. రేవణ్ణ అధికారులు, సిబ్బంది తీసుకువచ్చిన అట్టపెట్టలలోని బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుని వరద బాధితుల చేతికి ఇవ్వలేదు. వరద బాధితుల మీదకు బిస్కెట్ ప్యాకెట్లు విసిరేశారు. వీది కుక్కలకు బిస్కెట్లు విసిరేసినట్లు విసిరేసిన మంత్రి రేవణ్ణ సాఫిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వీడియో వైరల్
వరద బాధితులను ఆదుకొని పరామర్శించడానికి వచ్చినట్లు హంగామా చేసిన మంత్రి రేవణ్ణ కేవలం ఫోటోలకు ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి రేవణ్ణ వరద బాధితుల మీదకు బిస్కెట్ ప్యాకెట్లు విసురుతున్న సమయంలో కొందరు మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. మంత్రి రేవణ్ణ వరద బాధితుల పట్ల ప్రవర్తించిన తీరును చూసిన నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అధికార అహంకారం !
ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, మంత్రి అనే అహంకారంతో హెచ్.డి. రేవణ్ణ వరద బాధితుల పట్ల నీచంగా ప్రవర్తించారని అనేక మంది సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. బాధితులు అతి దగ్గరగా ఉన్నా వారికి నేరుగా బిస్కెట్ ప్యాకెట్లు పంచిపెట్టకుండా ఇలా కుక్కలకు విసిరేసినట్లు విసిరేయడం అధికార అహంకారం అని సోషల్ మీడియాలో అనేక మంది మండిపడుతున్నారు.
బిక్షగాళ్లు ఇంటి దగ్గరకు వస్తే !
బిక్షగాళ్లు ఇంటి దగ్గరకు వచ్చి అమ్మా అంటే వారి ఆకలి తీర్చడానికి మనం అన్నం పెడుతామని, అలాంటిది వరద బాధితుల సహాయక శిభిరాలకు వెళ్లిన మంత్రి రేవణ్ణ మాత్రం వాళ్లను బిక్షగాళ్ల కంటే నీచంగా చూశారని పలువురు మండిపడుతున్నారు.
సీఎం టైంపాస్ సర్వే ?
వరదల కారణంగా ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవడానికి ఏరియల్ సర్వే చెయ్యడానికి వెళ్లిన సీఎం హెచ్.డి. కుమారస్వామి హెలికాప్టర్ లో తీరికగా న్యూస్ పేపర్ చదవుతూ ఉన్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో తీవ్ర విమర్శలకు గురైనారు. ఇప్పుడు సీఎం సోదరుడు, మంత్రి రేవణ్ణ చేసిన పనికి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇలాంటి నాయకులు మనకు అవసరమా ? అంటూ అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.