నాయుడు కులం అడ్డం పెట్టుకుని సుమలతతో రాజకీయాలు, సిగ్గుగా ఉంది, మంత్రి ఫైర్ !
బెంగళూరు: ప్రముఖ నటి సుమలత గౌడ్తి కాదు, ఆమె తెలుగు నాయుడు కుటుంబ సభ్యురాలు, మండ్య గౌడను వివాహం చేసుకుని వచ్చినంత మాత్రానా గౌడ్తి కాలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేడీఎస్ పార్టీ ఎంపీ ఎల్.ఆర్. శివరామేగౌడ మీద కర్ణాటక మంత్రి (కాంగ్రెస్) ఎంటీబీ. నాగరాజ్ మండిపడ్డారు. ఆడపడుచు మీద ఆరోపణలు చేసే సమయంలో వెనుకా ముందు ఆలోచించాలని, ఆ విషయం ఎంపీగా ఎన్నికైన శివరామేగౌడకు తెలీదా అని మంత్రి ఎంటీబీ నాగరాజ్ ప్రశ్నించారు.
సుమలత కులం నాయుడు, గౌడ కాదు, సోనియా గాంధీని అడుగుతారా, ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!
26 ఏళ్లు కాపురం
పెళ్లి జరిగిన తరువాత భర్త కులం భార్యకు వర్థిస్తుందని, రెబల్ స్టార్ అంబరీష్, సుమలత వివాహం చేసుకుని 26 సంవత్సరాలు కాపురం చేశారని, సహజంగానే ఆమె గౌడ్తి అవుతారని, ఈ విషయం ఎంపీగా ప్రజా సేవ చేస్తున్న శివరామేగౌడకు తెలీదా అని మంత్రి ఎంటీబీ. నాగరాజ్ ప్రశ్నించారు.
రాజకీయాల్లో సహజం
దేవనహళ్ళిలో మాట్లాడిన ఎంటీబీ నాగరాజ్ జేడీఎస్ ఎంపీ శివారామేగౌడకు చివాట్లు పెట్టారు. సుమలత మీద శివరామేగౌడ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎంటీబీ నాగరాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో, ఎన్నికల్లో ప్రచారం చేసే సమయంలో ప్రతిపక్ష పార్టీల మీద ఆరోపణలు చేసుకోవడం సహజం అని మంత్రి ఎంటీబీ నాగరాజ్ గుర్తు చేశారు.
కులం, జాతి, మతం
ఎన్నికల ప్రచారంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరును ప్రచారం చేసి ప్రజలను ఓట్లు వెయ్యాలని మనవి చెయ్యాలని మంత్రి ఎంటీబీ నాగరాజ్ అన్నారు. అంతే కాని ప్రజల ముందుకు వెళ్లి కులం, మతం, జాతిని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించాలని ప్రయత్నించడం సిగ్గుచేటు అని ఎంటీబీ నాగరాజ్ అన్నారు.
నాయుడు కులం
నాయుడు కులం వదులుకుని గౌడను వివాహం చేసుకున్న సుమలత గౌడ్తి ఎలా అవుతారు ? ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తున్న చాలెంజింగ్ స్టార్ దర్శన్, ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కూడా నాయుడు కులంకు చెందిన వారే, వీళ్లందరూ నాయుడు కులానికి చెందిన వారే అంటూ జేడీఎస్ ఎంపీ శివరామేగౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నా జీవితం నాశనం
సుమలతతో పాటు కలిసి వీళ్లందరూ మండ్యను నాయుడుల మయం చెయ్యడానికి సిద్దం అయ్యారని, అందుకు తాము అంగీకరించమని జేడీఎస్ ఎంపీ శివరామేగౌడ అన్నారు. సుమలత భర్తను నమ్ముకుని తాను 20 సంవత్సరాల జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఎంపీ శివరామేగౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంపీ శివరామేగౌడ వ్యాఖ్యలపై ఆయన సొంత పార్టీ జేడీఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.