గోమూత్రం,పేడతో తయారుచేసిన సబ్బులు,శాంపూలే వాడండి... మంత్రి విజ్ఞప్తి...
కర్ణాటక ప్రజలు ఆవు మూత్రం,పేడతో చేసిన సబ్బులు,శాంపూలు,అగర్బత్తీలు వాడాలని ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ విజ్ఞప్తి చేశారు. తద్వారా గోరక్షణ జరుగుతుందన్నారు. ఆవు పాలు,పెరుగు,నెయ్యి,వెన్న వంటి పదార్థాలతో పాటు దాని మూత్రం,పేడతో తయారుచేసే సబ్బులు,శాంపూలు,వర్మీ కంపోస్ట్,పంచగవ్య,గౌభస్మ,పురుగు మందులను తప్పకుండా వాడాలని చెప్పారు.
మంగళవారం(జనవరి 5) నుంచి కర్ణాటకలో గోవధ నిషేధ చట్టం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టం కింద గోవులను సంరక్షించడానికి,రక్షించడానికి అయ్యే ఖర్చుపై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని ప్రభు చౌహాన్ తెలిపారు. అక్రమ రవాణా బారి నుంచి గోవులను రక్షించి గోశాలలకు చేర్చాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. కొత్త చట్టం ప్రకారం... గోవధకు పాల్పడినవారికి మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. రూ.1లక్ష నుంచి రూ.10లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారు. 13 ఏళ్లు నిండిన ఆవులు,గేదెలను మాత్రమే పశుసంవర్ధక శాఖ అనుమతితో వధించేందుకు వీలు ఉంటుంది.
ఇప్పటివరకూ ఈ చట్టం గుజరాత్, ఉత్తరప్రదేశ్లో అమల్లో ఉండగా తాజాగా కర్ణాటక ఆ జాబితాలో చేరింది. 'మన సంస్కృతిని మనం రక్షించుకోవాలి.. ప్రోత్సహించాలి. ఈ చట్టం తేవడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఇదే.. మరే ఇతర దురుద్దేశం లేదు' అని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది.
గతేడాది డిసెంబర్లో అసెంబ్లీలో కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.అయితే బిల్లుపై ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కేవలం పశుసంవర్ధక శాఖ మంత్రి.. బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ఒక ప్రకటన చదివి.. ఆమోదించేశారని.. చర్చకు అవకాశం ఇవ్వకపోవడమేంటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు.ఈ బిల్లుతో సమాజంలో అశాంతిని సృష్టించాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనివల్ల మతపరమైన ఉద్రిక్తతలు ఏర్పడతాయని మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ ఆరోపించారు.