మంత్రి పదవి మిస్, ఓదార్చడానికి చిన్నపిల్లాడా, సోదరుడికి షాక్ ఇచ్చిన కర్ణాటక మంత్రి !
బెంగళూరు: కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవులు రాలేదని చాల మంది సీనియర్ ఎమ్మెల్యేలు అసమ్మతితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, సోదరులు రమేష్ జారకిహోళి, సతీష్ జారకిహోళిల్లో ఒక్కరికే మంత్రి పదవి వచ్చింది. తన సోదరుడిని ఓదార్చడానికి ఏమైనా చిన్నపిల్లాడా అంటూ మంత్రి షాక్ ఇచ్చారు.
కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్న రమేష్ జారకిహోళి గురువారం బెళగావిలోని సాంబ్రా విమానాశ్రయం చేరుకున్నారు. మంత్రి పదవిరాలేదని అసమ్మతి వ్యక్తం చేస్తున్న సోదరుడు సతీష్ జారకిహోళిని మీరు ఓదార్చుతారా అనే ప్రశ్నకు మంత్రి రమేష్ జారకిహోళి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.
సతీష్ జారకిహోళిని ఓదార్చడానికి చిన్నపిల్లాడు కాదని, ఆయన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడని మంత్రి రమేష్ జారకిహోళి సమాధానం ఇవ్వడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బిత్తరపోయారు. పార్టీ కోసం ఒక్కోసారి మనం త్యాగం చెయ్యాల్సి ఉంటుందని మంత్రి రమేష్ జారకిహోళి అన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో సీనియర్ అయిన తనను పక్కనపెట్టి తన సోదరుడు సతీష్ జారకిహోళికి మంత్రి పదవి ఇచ్చారని, అప్పుడు నేను బాధపడలేదని రమేష్ జారకిహోళి గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి తనలాంటి రమేష్ జారకిహోళిలను 10 మందిని తయారు చేసే సత్తా ఉందని అన్నారు. పరోక్షంగా తన సోదరుడు సతీష్ జారకిహోళిని ఓదార్చాల్సిన అవసరం లేదని మంత్రి రమేష్ జారకిహోళి చెప్పారు. సిద్దరామయ్య వలనే తనకు మంత్రి పదవి వచ్చిందని, అందులో ఎలాంటి అనుమానం లేదని రమేష్ జారకిహోళి మీడియాకు చెప్పారు.