సాధారణ చీరతో సామూహిక వివాహంలో పెళ్లాడిన మంత్రి కూతురు
బెంగళూరు: ఏ మంత్రి అయినా తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తారు! ఓ ఎమ్మెల్యే అయితేనే తమ పిల్లల పెళ్లి ఘనంగా జరిపిస్తారు. అయితే, కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి మాత్రం తన కూతురు పెళ్లిని సాముహిక వివాహాలలో జరిపించారు.
బలహీనవర్గాలకు చెందిన 96 జంటలతో పాటు తన కుమార్తె పెళ్లిని సదరు మంత్రి జరిపించారు. కర్నాటక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్ ఆంజనేయులు కూతురు అనుపమ ఈ నెల 19వ తేదీన చిత్రదుర్గలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి ఎలాంటి నగలు ధరించకుండా మామూలు చీరలో వచ్చి పెళ్లిపీటల పైన కూర్చున్నారు.
అందరితో పాటు ప్రభుత్వం ఇచ్చిన మంగళసూత్రాన్ని కట్టించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆంజనేయులు మాట్లాడుతూ.. తన కూతురు ఎన్నో ఫైవ్ స్టార్ హోటళ్లలో విందులు, వినోదాలకు హాజరయిందని, ఎంతోమంది ఉన్నత కుటుంబాల పెళ్లిళ్లకు వచ్చిందని కాని, ఇలా అన్నీవదిలి సాధారణ పెళ్లి చేసుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తన కూతురు నిర్ణయం ఓ రాజకీయ సందేశాన్ని ప్రజలకు ఇచ్చిందన్నారు.