ప్రోటోకాల్ ఉల్లంఘన: ఇంటికి పిలిపించుకుని కరోనా వ్యాక్సిన వేయించుకున్న మంత్రి
బెంగళూరు: కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ వివాదంలో చిక్కికుకున్నారు. మంత్రి పాటిల్ హైరికెరూర్లోని తన నివాసంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇది కరోనా ప్రోటోకాల్ను ఉల్లంఘించడమేనని విమర్శలు వస్తున్నాయి.
తాలూక ఆరోగ్య అధికారి, ఇతర సిబ్బందిని తన ఇంటికి పిలిపించుకున్న మంత్రి.. తనకు, తన కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తనకు ఈ ప్రోటోకాల్ తెలియదని మంత్రి చెప్పడం గమనార్హం.
కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ మాట్లాడుతూ.. ఇది ఖచ్చితంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ఉల్లంఘనేనని అన్నారు. విచారణ జరిపి మంత్రి ఇంటికి వెళ్లి వ్యాక్సిన్ వేసిన వైద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ ఘటనపై కేంద్ర ఆరోగ్య సెక్రటరీ రాజీవ్ భూషణ్ కూడా స్పందించారు. కర్ణాటక నుంచి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కోరినట్లు తెలిపారు. ఇలాంటి కరోనా ప్రోటోకాల్ కు విరుద్ధమైన చర్యలను తాము ఉపేక్షించేది లేదని చెప్పారు.
Took the #COVID19Vaccine with my wife, at my Hirekerur house from the Govt. doctors today.
— Kourava B.C.Patil (@bcpatilkourava) March 2, 2021
While 'Made In India' vaccines are being immensely appreciated by many countries, some vested interest groups are spreading false information about the vaccines.@DDChandanaNews | @DHFWKA pic.twitter.com/yE6fYZTddJ
కాగా, కర్ణాటకలోనూ కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం 9,52,037 కరోనా కేసులు ఉన్నాయి. 9,33,730 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 12,343 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,945 యాక్టివ్ కేసులున్నాయి.