పదో తరగతిలోనే ప్రేమ: అయిదు నెలల కిందట అదృశ్యం.. బావిలో మృతదేహంగా.. !
బెంగళూరు: సుమారు అయిదు నెలల కిందట అదశ్యమైన ఓ విద్యార్థిని ఉదంతం విషాదంతమైంది. ఎప్పటికైనా తమ కుమార్తె కనిపిస్తుందంటూ ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతూ.. ఆమె మృతదేహమై కనిపించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా పరిధిలోని ఆదివాల గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. తమ కుమార్తెను ఆమె ప్రియుడే హత్య చేసి ఉంటాడని తల్లిదండ్రులు, ఆతర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మృతి చెందిన విద్యార్థిని పేరు పల్లవి. వయస్సు 15 సంవత్సరాలు. ఆదివాల గ్రామానికి చెందిన కుమార్, చంద్రమ్మ దంపతుల కుమార్తె. హిరియూరులోని ప్రభుత్వ ప్రాథిమికోన్నత పాఠశాలలో ఆమె పదవ తరగతి చదువుతున్నారు. ఆదివాల గ్రామానికే చెందిన మల్లేశ అనే యువకుడిని ఆమె కొంతకాలంగా ప్రేమిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మల్లేశ తో ప్రేమ వివాహం తెలియడంతో పల్లవి తల్లిదండ్రులు ఆమెను మందలించారు. చదువును మాన్పించారు.
సుమారు అయిదు నెలల కిందట ఆమె అదృశ్యం అయ్యారు. పల్లవి తండ్రి కుమార్.. తన కుమార్తె కనిపించట్లేదంటూ హిరియూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మల్లేశ కూడా కనిపించ లేదు. దీనితో వారిద్దరూ పారిపోయి, పెళ్లి చేసుకుని ఉంటారని గ్రామస్తులు అనుమానించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తుండగానే.. పల్లవి మృతదేహం కనిపించింది. ఆదివాల గ్రామ శివార్లలోని ఓ వ్యవసాయ బావిలో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కాగా- తమ కుమార్తె చనిపోవడానికి మల్లేశ కారణమని పల్లవి తండ్రి కుమార్ ఆరోపిస్తున్నారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను మోసగించాడని, అతనే తమ కుమార్తెను హత్య చేసి ఉంటారని హిరియూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదివరకే మిస్సింగ్ గా నమోదైన పల్లవి కేసును అనుమానాస్పద మృతిగా బదలాయించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ తెలిపారు.