కర్ణాటక బీజేపీ చీఫ్, మాజీ సీఎం కొడుకు, ఎమ్మెల్యే కారు ఢీ: యువకుడి దుర్మరణం!
బెంగళూరు: బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప కుమారుడు, శివమొగ్గ జిల్లా శికారిపుర నియోజక వర్గం శాసన సభ సభ్యుడు బీవై. రాఘవేంద్ర కారు ఢీకొని యువకుడు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందిన ఘటన కర్ణాకటలోని దావణగెరె జిల్లాలో జరిగింది.
గురువారం రాత్రి బీజేపీ ఎమ్మెల్యే బీఎస్. రాఘవేంద్ర దావణగెరె జిల్లా హున్నాళి నుంచి శికారిపురకు కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో హున్నాళి తాలుకా మాదాపుర క్రాస్ సమీపంలో రాఘవేంద్ర కారు ఎదరుగా వస్తున్న బైక్ ను ఢీకొనింది.
ఈ ప్రమాదంలో సురేష్ (24) అనే యువకుడు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందాడు. పనిముగించుకుని బైక్ లో ఇంటికి వెలుతున్న సురేష్ ను రాఘవేంద్ర కారు ఢీకొనిందని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో రాఘవేంద్ర కారును ఆయన డ్రైవర్ నడుపుతున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. న్యామతి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎమ్మెల్యే రాఘవేంద్ర కారును స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.