పెళ్లి ఫిక్స్: సినీ నిర్మాతతో లేచిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కూతురు, పోలీసులు, పరుగో పరుగు!
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే తన కుమార్తె కనపడంలేదని, ఆచూకి కనిపెట్టాలని బెంగళూరు నగరంలోని యలహంక న్యూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. స్యాండిల్ వుడ్ కు చెందిన సినీ నిర్మాతతో సదరు ఎమ్మెల్యే కూతురు లేచిపోయిందని గురువారం బెంగళూరులో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్తెకు ఇంతకు ముందే వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయ్యిందని వెలుగు చూసింది.
అధికార పార్టీ ఎమ్మెల్యే
కర్ణాటకలోని దావణగెరె జిల్లా మాయనకోండ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కు లక్ష్మి నాయక్ (30) అనే కుమార్తె ఉంది. రెండు రోజులుగా తన కుమార్తె కనపడటం లేదని గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ బెంగళూరులోని యలహంక న్యూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సినీ నిర్మాతతో లవ్!
కన్నడ మాస్తిగుడి (హెలికాప్టర్ నుంచి ఇద్దరు విలన్లు చెరువులో పడి జలసమాధి అయిన సినిమా) నిర్మాత సుందర్ పి. గౌడతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కుమార్తె లక్ష్మి నాయక్ కు చాల కాలం నుంచి స్నేహం ఉంది. సుందర్ పి. గౌడ, లక్ష్మి నాయక్ ప్రేమించుకుంటున్నారని సమాచారం.
సినిమా డైలాగ్ చెప్పిన ఎమ్మెల్యే
స్యాండిల్ వుడ్ సినీ నిర్మాత సుందర్ పి. గౌడను వివాహం చేసుకుంటానని లక్ష్మి నాయక్ ఆమె తండ్రి శివమూర్తి నాయక్ కు చెప్పారు. అయితే వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ సినిమా డైలాంగ్ చెప్పాడని తెలిసింది.
లక్ష్మి నాయక్ నిశ్చితార్థం
ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ ఆయన కులానికి చెందిన యువకుడితో లక్ష్మి నాయక్ తో నిశ్చితార్థం చేయించాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని లక్ష్మి నాయక్ ఇంటి నుంచి పారిపోయారని తెలిసింది.
ఫ్రెండ్స్ కు సమాచారం
తాను ప్రేమించిన సినీ నిర్మాత సుందర్ పి. గౌడను వివాహం చేసుకుంటానని, ఇంటిలో చూసిన సంబంధం తాను చేసుకోనని లక్ష్మి నాయక్ ఆమె స్నేహితులకు చెప్పిందని వెలుగు చూసింది. లక్ష్మి నాయక్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ ఆమె సుందర్ పి. గౌడతో వెళ్లింది అని మాత్రం చెప్పలేదని పోలీసులు అంటున్నారు.
మైసూరులో మకాం
స్యాండిల్ వుడ్ నిర్మాత సుందర్ పి. గౌడ, లక్ష్మి నాయక్ మైసూరులో ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. గురువారం సుందర్ పి. గౌడ, లక్ష్మి నాయక్ వారి సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారని వారి సన్నిహితులు అంటున్నారు.
పరుగో పరుగు
లక్ష్మి నాయక్ కనిపించడం లేదని కేసు నమోదు చేసిన యలహంక న్యూ టౌన్ పోలీసులు ఆమె మైసూరులో ఉన్నారని తెలుసుకున్న పరుగు తీశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావటంతో పోలీసులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని కేసు విచారణ చేస్తున్నారు.