సుప్రీం కోర్టు తీర్పు, ఊపిరి పీల్చుకున్న బీజేపీ, అనర్హత ఎమ్మెల్యేలు, ఉప ఎన్నికల్లో పోటీకి!
న్యూఢిల్లీ: కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు ఊపిరిపీల్చుకున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హత ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తున్నామని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని బెంచ్ సృష్టం చేసింది. అయితే మీరు ఎందుకు హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీం కోర్టుకు వచ్చారు ? అంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని బెంచ్ అనర్హత ఎమ్మెల్యేలను ప్రశ్నించింది. ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా స్పీకర్ అనర్హత వేటు వెయ్యడం భావ్యం కాదని, వారి అభిప్రాయాలను గౌరవించాలని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేలు ప్రవర్థిస్తున్న తీరును న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు చెప్పింది. కర్ణాటకలోని అప్పటి సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేల మీద అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు.
అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ తమ మీద అనవసరంగా అనర్హత వేటు వేశారని, మాకు న్యాయం చెయ్యాలని అనర్హత ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి సుప్రీం కోర్టులో కేసు విచారణ జరిగింది. సుప్రీం కోర్టు తీర్పు కోసం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూశాయి.
బుధవారం ఉదయం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని బెంచ్ అనర్హత ఎమ్మెల్యేల కేసు తీర్పు వెల్లడించింది. చట్టపరంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని భావిస్తే దానిని స్పీకర్ అంగీకరించాలని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
సుప్రీం కోర్టు తీర్పుతో అనర్హత ఎమ్మెల్యేలు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. సుప్రీం కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని, న్యాయస్థానం మీద తమకు గౌరవం ఉందని, మాకు న్యాయం జరిగిందని అనర్హత ఎమ్మెల్యేలు అన్నారు. ఉప ఎన్నికల్లో తాము పోటీ చేసి కచ్చితంగా గెలుస్తామని అనర్హత ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు.