అయ్యప్ప మాలను ధరించిన ముస్లిం యువకుడు: 41 రోజుల పాటు కఠోర దీక్ష..!
బెంగళూరు: రాజకీయాల్లోకి కులాలు, మతాల ప్రస్తావనను తీసుకొస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మత సామరస్యాన్ని చాటి చెప్పాడో ముస్లిం యువకుడు. అయ్యప్ప స్వామి మాలను ధరించారు. 41 రోజుల పాటు కఠోర దీక్షను చేపట్టాడు. దీక్షానంతరం కాలి నడకన శబరిమలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన బబ్లూ అలియాస్ భాషా. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా గుర్మిట్ కల్ లో ఓ ప్రైవేటు సంస్థలో లారీ డ్రైవర్ గా పని చేస్తున్నారు.
Disha Murder case:రాత్రివేళ మహిళలకు పోలీసు వాహనాల్లో ఇంటి వద్ద డ్రాప్: పురుడు పోసుకున్న స్కీం..!
బబ్లూ స్వస్థలం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్. వృత్తిరీత్యా గుర్మిట్ కల్ లో స్థిర పడ్డారు. బబ్లూ పని చేస్తోన్న సంస్థ యజమాని నరేంద్ర రాథోడ్.. 12 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అయ్యప్ప మాలను ధరిస్తున్నారు.
మూడు నెలల కిందటే నరేంద్ర రాథోడ్ సంస్థలో చేరిన బబ్లూ తన యజమానిని చూసి ప్రేరణ పొందారు. తాను కూడా అయ్యప్ప దీక్షను స్వీకరించారు. గుర్మిట్ కల్ అయ్యప్పస్వామి భక్తసంఘం అధ్యక్షుడు, గురుస్వామి నరసప్ప స్వామి ఆయనకు మాలను ధరింపజేశారు. అయ్యప్పుడి మాలను ధరించడం బబ్లూకు ఇదే తొలిసారి. కన్నెస్వామిగా ఆయన శబరిమలకు వెళ్లనున్నారు.
సోమవారం ఉదయం గుర్మిట్ కల్ లో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్నారాయన. భక్తితో అయ్యప్ప గీతాలను ఆలపించారు. తోటి స్వాములు పాటిస్తోన్న నియమాలన్నింటినీ తానూ ఆచరిస్తున్నారు. అయ్యప్ప స్వామి మాలను ధరించడం ఇదే తొలిసారి కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ తాను కఠోర నియమాలను అనుసరిస్తానని చెప్పారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు కాలి నడకన వెళ్లాలని భావిస్తున్నానని అన్నారు.