ర్యాగింగ్ వికృత రూపం: బలవంతంగా టాయిలెట్ క్లీనింగ్ లోషన్ తాగించారు
కోజికోడ్: కర్ణాటకోల ర్యాగింగ్ మరోసారి వికృత రూపం దాల్చింది. సీనియర్ల ర్యాగింగ్ భూతానికి ఓ నర్సింగ్ విద్యార్ధిని ఆసుపత్రి పాలైంది. ర్యాగింగ్ సందర్భంగా టాయిలెట్స్ క్లీన్ చేసే లోషన్ను తాగించడంతో ఆమె కడుపులోని భాగాలన్నీ దెబ్బతిన్నాయి.
వివరాల్లోకి వెళితే కర్ణాటక గుల్బర్గాలోని ఆల్ కామర్ నర్సింగ్ కాలేజీలో ఐదు నెలల క్రితం చేరిన కేరళకు చెందిన ఓ దళిత విద్యార్ధిని (19) అక్కడ లేడిస్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. మే 9వ తేదీన కేరళకు చెందిన 8 మంది సీనియర్ విద్యార్ధులు ఆమెను ర్యాగింగ్ చేశారు.
ర్యాగింగ్ చేస్తూ టాయిలెట్స్ క్లీన్ చేసే లోషన్ను ఆమె చేత బలవంతంగా తాగించినట్లు పోలీసుల వెల్లడించారు. దీంతో విద్యార్ధిని శరీరంలోని సున్నితమైన భాగాలు దెబ్బతినడంతో ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం అక్కడ పరిస్థితి విషమించడంతో ఐదు రోజుల తర్వాత బాధితురాలి సొంత ఊరైన మల్లప్పరం జిల్లాలోని ఎడప్పల్ గ్రామానికి ఓ కేరళ విద్యార్ధిని సాయంతో ఆమెను ఇంటికి పంపించేశారు.
కొద్ది రోజుల తర్వాత ఆమెను త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చించగా కొన్ని రోజుల పాటు చికిత్సను అందించిన వైద్యుల సూచన మేరకు జూన్ 2వ తేదీన కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షలు నిర్వహించిన వైద్యులు టాయిలెట్ లోషన్ను తాగించడంతో ఆమె శరీరంలోని సున్నితమైన భాగాలు కాలిపోయాయని, ఆహార వాహిక దారుణంగా దెబ్బతిందని తెలిపారు.
దీంతో ఆమెకు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఐసీయూలో ఉంచి ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేఎంసీహెచ్ పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం తదితర సెక్షన్ల కింద సీనియర్ విద్యార్ధులపై కేసు నమోదు చేశారు.
అనంతరం కేసును గుల్బర్గా వర్సిటీ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన నర్శింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ సంఘటన సెలవు రోజుల్లో జరిగిందని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్ధిని ఆసుపత్రిలో చేర్పించామని అన్నారు. నాలుగు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారని, అనంతరం ఆమెను కేరళకు పంపించినట్లు తెలిపారు.