ప్రధాని స్కాలర్ షిప్, ఉగ్రదాడికి మద్దతు, దాడి, బెంగళూరులో నర్సింగ్ విద్యార్థులు అరెస్టు!
బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ లోని పూల్వామా జిల్లా అంతిపుర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబందించి సోషల్ మీడియాలో వీర జవాన్లకు వ్యతిరేకంగా పోస్టు చేసిన ముగ్గురు విద్యార్థులను బెంగళూరు శివార్లలో అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ముగ్గురు బెంగళూరు శివార్లలో విద్యాభ్యాసం చేస్తున్నారు.
వాకర్ అహమ్మద్, గౌర్ ముస్తాక్, జాకిర్ మక్బాల్ అనే ముగ్గురు ప్రధాన మంత్రి స్కాలర్ షిప్ సహాయంతో బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్ సమీపంలోని ఓ కాలేజ్ లో నర్శింగ్ విద్యాభ్యాసం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పూల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ అదే కాలేజ్ విద్యార్థి కౌసిక్ దెబెనాథ్ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.
ఉగ్రదాడిని వ్యతిరేకించకూడదని, వెంటనే ఆ పోస్టును తొలగించాలని ఈ ముగ్గురు సోషల్ మీడియాలోనే కౌసిక్ ను బెదిరించారు. తరువాత పాకిస్తాన్, ఉగ్రవాదులకు మద్దతుగా వాకర్ అహమ్మద్, గౌర్ ముస్తాక్, జాకిర్ మక్బాల్ అనే ముగ్గురు కౌసిక్ ముందు నినాదాలు చేశారు.
ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వకూడదని అభ్యంతరం వ్యక్తం చేసిన కౌసిక్ మీద ముగ్గురు నిందితులు దాడి చేశారు. మా రాష్ట్రంలో జరిగిన ఉగ్రదాడిని తాము సమర్థిస్తున్నామని ముగ్గురు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.