Corona కష్టాలు: తెర వెనుక సీఎం ఎవరు ? ఎమ్మెల్యేల దెబ్బతో సీఎంకు సినిమా, అమిత్ షా ఎంట్రీ !
బెంగళూరు/ న్యూఢిల్లీ: భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని ఎలా ఎదుర్కొవాలని ప్రస్తుతం ఆలోచిస్తున్నాయి. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు కరోనా వైరస్ భయంతో పాటు సొంత పార్టీలోని కొందరు నేతలు ఎక్కడ తన సీఎం సీటు కిందుకు నీళ్లు తెస్తారో ? అనే భయం పట్టుకుందని విమర్శలు ఎదురౌతున్నాయి. ఇటీవల సీఎంకు అత్యంత సన్నిహితుడు సుమారు 20 మంది ఎమ్మెల్యేలతో రహస్యంగా సమావేశం నిర్వహించడం బీజేపీ వర్గాల్లో కలకలంరేపాయి. ఇదే సమయంలో కర్ణాటకలో తెర మీద సీఎం యడియూరప్ప అయితే తెర వెనుక మరో సీఎం ఉన్నాడంటూ మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో యడియూరప్ప సన్నిహితులు ఉలిక్కిపడ్డారు. దెబ్బకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఎంట్రీ ఇచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
వాడుకుని వదిలేసిన ప్రియుడు, నటి ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో షాకింగ్ నిజాలు, రూ. లక్షలు స్వాహా !
సీఎం సన్నిహితుడి దెబ్బ
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఉత్తర కర్ణాటకలో ప్రభావంతమైన నాయకుడు ఉమేష్ కత్తి ఇటీవల ఆయన ఇంటిలో నిర్వహించిన ఓ సమావేశానికి సుమారు 20 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారని వెలుగు చూసింది. తాము కేవలం భోజనం చెయ్యడానికే ఉమేష్ కత్తి ఇంటికి వెళ్లామని బీజేపీ ఎమ్మెల్యేలు పైకి చెబుతున్నారు. అయితే సీఎం యడియూరప్ప లింగాయుత వర్గానికి చెందిన ఎమ్మెల్యేల గురించి పట్టించుకోవడం లేదని, ఆ వర్గంలో ఆయన మాత్రమే పైకి ఎదగాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
బాంబు పేల్చిన మాజీ సీఎం
కర్ణాటకలో తెర మీద బీఎస్. యడియూరప్ప సీఎం అయితే తెర వెనుక మరో ముఖ్యమంత్రి ఉన్నారని, ఆయన ఎవరో మీకు తెలుసా?, అధికారం కోసం తెర ముందు ఓ సీఎం, తెర వెనుక ఓ సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు అధికారంలో ఉండదంటూ కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
పేరుకు మాత్రమే సీఎం ?
కర్ణాటకలో పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా బీఎస్. యడియూరప్ప ఉన్నారని, తెర వెనుక జరిగే తతంగం వేరుగా ఉందని, తెర వెనుక ఉన్న ఆ సీఎం చెప్పినట్లే బీజేపీలో జరుగుతోందని, అధికారులు కూడా ఆయన మాటే వింటారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉమేష్ కత్తి ఇంటిలో బీజేపీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ఏర్పాటు చేసిన తరువాత మాజీ సీఎం సిద్దరామయ్య ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం సిద్దరామయ్య ఏకంగా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చెయ్యడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప వర్గీయులు ఉలిక్కిపడ్డారు.
ముగ్గురు డీసీఎంలు అందుకేనా ?
కర్ణాటకలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అందులో ఎమ్మెల్యేగా ఓడిపోయినా లక్ష్మణ సవదికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అక్కడే మొబైల్ లో పోర్న్ వీడియోలు చూస్తున్న లక్షణ సవది మీడియా కెమెరాలకు అడ్డంగా చిక్కిపోవడంతో అప్పట్లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాంటి లక్షణ సవది ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తనది ఏమీ లేదని, హైకమాండ్ చెప్పినట్లు తాను చేశానని సీఎం యడియూరప్ప తన సన్నిహితుల దగ్గర వాపోయారని తెలిసింది. యడియూరప్పకు కళ్లెం వెయ్యడానికి బీజేపీ హైకమాండ్ ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు నియమించిందని ఆరోపణలు ఉన్నాయి.
రేసులో మాజీ సీఎం, కేంద్ర మంత్రి !
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద సొంత పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. బీఎస్. యడియూరప్పను సీఎం సీటు నుంచి తప్పించి ఆ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత భారీ పరిశ్రమల శాఖా మంత్రి జగదీష్ శెట్టర్ ను లేదా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలో ఎవరినో ఒకరిని సీఎం చేస్తారని, మా దగ్గర ఆ సమాచారం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సతీష్ జారకిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కూల్ గా ఉండాలని అమిత్ షా హామి !
తన సీఎం సీటుకు ఎసరుపెడుతున్నారని తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాను ఫోన్ లో సంప్రదించారని తెలిసింది. మీరు ముఖ్యమంత్రిగా బాగా పని చేస్తున్నారు. కూల్ గా మీ పని మీరు చేసుకుని వెళ్లండి, అంతా నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి అంటూ కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు హామీ ఇచ్చారని తెలిసింది.
ఓ పక్క కరోనా, మరో పక్క సీఎం కుర్చి
కర్ణాటకలో కరోనా కట్టడి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఇప్పుడు ఆయన సీఎం సీటును కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద రాజ్యసభ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలో కర్ణాటకలో అసమ్మతి నేతలు ఇదే మంచి చాన్స్ అంటూ తెర వెనుక రాజకీయాలు చెయ్యడం మొదలు పెట్టారని తెలిసింది.