నటి, మాజీ ఎంపీ రమ్యాకు శాపనార్తాలు, రాజకీయ గురువు రెబల్ స్టార్ మరణిస్తే ఇంత గర్వమా, ఛీ!
బెంగళూరు: రాజకీయ గురువు రెబల్ స్టార్ అంబరీష్ అనారోగ్యంతో మరణిస్తే కేవలం సోషల్ మీడియాలో సంతాపం తెలిపి ఢిల్లీలో మకాం వేసిన మాజీ ఎంపీ, బహుబాష రమ్యా అలియా దివ్యా స్పందనకు మండ్య ప్రజలు, కన్నడిగులు శాపనార్తాలు పెడుతున్నారు. రాజకీయ గురువు అంబరీష్ మరణించినా నివాళులు అర్పించడానికి రాలేదని, ఇలాంటి నీచరాజకీయాలు చేసే నటి రమ్యాకు తగిన గుణపాఠం చెబుతామని మండ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
మండ్య ప్రజల డిమాండ్
మా జిల్లాలో జన్మించిన రెబల్ స్టార్ అంబరీష్ మృతదేహాన్ని మండ్యకు తీసుకురావాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేశారు. మండ్య జిల్లా ప్రజల మనవిని సీఎం హెచ్.డి. కుమారస్వామి గౌరవించి అందుకు అంగీకరించారు. అంబరీష్ మృతదేహాన్ని మండ్యలోని శ్రీ ఎం. విశ్వేశ్వరయ్య స్టేడియంకు తరలించిన తరువాత స్థానిక ప్రజలు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే అంబరీష్ కుటుంబ సభ్యులు, సీఎం. కుమారస్వామి, మంత్రులు, స్థానిక నాయకులు అక్కడి అభిమానులకు నచ్చచెప్పి అంబరీష్ మృతదేహాన్ని బెంగళూరుకు తరలించారు.
రమ్యా పరిచయం
సినిమాల్లో నటిస్తున్న రమ్యా అనుకోకుండా రాజకీయాల్లోకి రావాలని భావించారు. అప్పటికే మండ్య జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఉన్న రెబల్ స్టార్ అంబరీష్ కాళ్ల మీద పడిన రమ్యా రాజకీయాంగా తనకు జన్మనివ్వాలని వేడుకున్నారు. ఆ సందర్బంలో రెబల్ స్టార్ అంబరీష్ మండ్య రాజకీయాలకు రమ్యాను పరిచయం చేశారు.
ఎంపీగా విజయం
మండ్య లోక్ సభ ఉప ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఎంతో పోటీ ఉన్నా రెబల్ స్టార్ అంబరీష్ టిక్కెట్ రమ్యాకు ఇవ్వాలని, తాను గెలిపించుకుంటానని హైకమాండ్ కు హామీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం రమ్యాను ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నారు. తరువాత రమ్యా రెబల్ స్టార్ అంబరీష్ కే ఎదురుతిరిగారని ఆరోపణలు ఉన్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రెబల్ స్టార్ అంబరీష్ రమ్యాకు మద్దతుగా ఎలాంటి ప్రచారం చెయ్యలేదు. ఫలితంగా నటి రమ్యా దారుణంగా ఓడిపోయారు. తన ఓటిమికి కారణం అయిన వారిలో రెబల్ స్టార్ అంబరీష్ ఒక్కరని రమ్యా భావించారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
కేవలం ఒక్క ట్వీట్
రెబల్ స్టార్ అంబరీష్ మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, నటి రమ్యా ఒక్క ట్వీట్ చేశారు. అంబరీష్ అంకుల్ చనిపోయారని తెలిసింది, ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతించాలని కోరుకుంటున్నాను అంటూ రమ్యా ట్వీట్ చేశారు.
సంస్కారం లేదు
అంబరీష్ అంతిమ సంస్కారాలలో పాల్గొనకుండా కేవలం ఒక్క ట్వీట్ తో సంతాపం తెలిపిన నటి రమ్యాకు మండ్య ప్రజలు, ఆ జిల్లా కాంగ్రస్ పార్టీ కార్యకర్తలు శాపనార్తాలు పెడుతున్నారు. నిన్ను ఎంపీగా గెలిపించి రాజకీయ భిక్షపెట్టిన అంబరీష్ మరణిస్తే కనీసం నివాళులు అర్పించడానికి తీరికలేకుండా పోయిందా, అంత గర్వామా అంటూ ప్రశ్నిస్తున్నారు. రమ్యా పేరు ఎత్తితేనే మండ్య జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.