కరువు కష్టాలకు చెక్.. కర్నాటకలో రూ.88 కోట్లతో క్లౌడ్ సీడింగ్..
బెంగళూరు : కరువును ఎదుర్కొనేందుకు కర్నాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. రుతుపవనాల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో సర్కారు అప్రమత్తమైంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జూన్ నెలాఖరులో మేఘ మథనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 88కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమైన కుమారస్వామి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది.
కర్ణాటక రాజకీయాల ముందు సమ్మర్ వేస్ట్..! చెమటలు కక్కిస్తున్న నేతల పరస్పర ఆరోపణలు..!!
మేఘ మథనానికి ఏర్పాట్లు
వర్షాభావ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ ప్రకటించారు. '2019లో వర్షపాతం సాధారణం కన్నా తక్కువ నమోదవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా 2019-20, 2020-21లో మేఘ మథనం నిర్వహించాలని నిర్ణయించామ'ని చెప్పారు. రానున్న 10రోజుల్లో ప్రభుత్వం టెండర్లను ఖరారు చేస్తుందని గౌడ స్పష్టం చేశారు.
జూన్ చివరి వారంలో క్లౌడ్ సీడింగ్
రాష్ట్రంలో జూన్ చివరి నాటికి క్లౌడ్ సీడింగ్ ప్రాసెస్ షురూ చేయనున్నట్లు మంత్రి ప్రకటించింది. కరువును నివారించేందుకు మేఘమథనం సరైన మార్గమన్న నిపుణుల అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కర్నాటక ప్రభుత్వం గతంలోనూ మేఘ మథనం నిర్వహించింది. అయితే అప్పట్లో వర్షాకాలం దాదాపు ముగిసిన తర్వాత ఆగస్టులో ఈ ప్రక్రియ చేపడుతుండటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ఈసారి జూన్లోనే క్లౌడ్ సీడింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
రెండు కేంద్రాల ఏర్పాటు
మేఘ మథనం కోసం బెంగళూరు, హుబ్లీల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రెండు విమానాల ద్వారా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఒకవేళ ఈ రెండు ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఆ సెంటర్లను వర్షాభావ ప్రాంతాలకు మార్చనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కరువు పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.