వర్క్ ఫ్రమ్ హోం అంటూ వందల కోట్లు దోచేశారు, నిందితుల కోసం కర్ణాటక పోలీసుల వేట
విదేశీ పుస్తకాలను స్కానింగ్ చేసి పిడిఎఫ్ పైళ్ళను ఇంటర్నెట్ లో పెడితే లక్షల్లో ఆదాయాన్ని సమకూరుస్తామంటూ మోసగాళ్ళు పన్నిన వలలోచిక్కుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బెంగుళూరు: విదేశీ పుస్తకాలను స్కానింగ్ చేసి పిడిఎఫ్ పైళ్ళను ఇంటర్నెట్ లో పెడితే లక్షల్లో ఆదాయాన్ని సమకూరుస్తామంటూ మోసగాళ్ళు పన్నిన వలలోచిక్కుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటుచేసుకొంది.
ఈ- బుక్ ప్రాజెక్టు పేరుతో విదేశాలకు చెందిన పుస్తకాలను స్కానింగ్ చేసి పీడీఎఫ్ లోకి మార్చి పంపిస్తే ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చంటూ గుజరాత్ కు చెందిన ఓ కంపెనీ ప్రకటనలు ఇచ్చింది. దీన్ని చూసిన బెంగుళూరు విజయనగర్ కు చెందిన వినోద్ కుమార్ ఈ- బుక్ ప్రాజెక్టు తీసుకొన్న తన స్నేహితుడి ద్వారా కంపెనీ ప్రతినిధులను సంప్రదించాడు.
అయితే రూ.1.50 లక్షల సెక్కూరిటీ డిపాజిట్ చెల్లించాలని చెప్పడంతో ఇంట్లో నగలమ్మి కట్టేశాడు. అనంతరం రూ.45వేలతో స్కానింగ్ యంత్రాన్ని కొనుగోలు చేశారు. పుస్తకాలను స్కానింగ్ చేసి పీడీఎఫ్ లోకి మార్చి పంపించి నెలలు గడుస్తున్నా కంపెనీ పైసా కూడ ఇవ్వకపోవడంతో అనుమానంతో ఫోన్ చేస్తే ఫోన్ పనిచేయలేదు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.
బెంగుళూరులోనే సుమారు 40 మంది ఈ రకంగా మోసపోయారు. వినోద్ కుమార్ తో పాటు వారు కూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్క కర్ణాటకలోనే ఆ కంపెనీకి వెయ్యిమందికి పైగా సభ్యులు ఉన్నట్టు గుర్తించారు. వారి నుండి లక్ష నుండి రూ.4 లక్షలను వసూలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోనే సుమారు రూ.150 కోట్లను కొల్లగొట్టినట్టు సమాచారం. గుజరాత్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో కూడ ఇదే తరహలో రూ. 300 కోట్లను వసూలు చేశారని తెలుస్తోంది.
అమెరికా, అస్ట్రేలియాలోని కాలేజీలు, గ్రంథాలయాల్లోని పుస్తకాలను ఈ- బుక్స్ గా మార్చేందుకు నిర్ణయించుకొన్నాయని, ఈ పనిని తమకు అప్పగించినట్టు ప్రచారం చేస్తారు. పీడీఎప్ లు కంపెనీ మెయిల్ కు పంపింతే చాలంటూ అమాయకులకు వల వేస్తారు. ప్రతి పేజీకి రూ.6 చెల్లిస్తామంటారు. ఒక్కో ప్రాజెక్టులో 15 వేల పేజీలుంటాయని, లక్షల్లో ఆదాయం వస్తోందని నమ్మబలుకుతారు. కంపెనీ ప్రతినిధులు రాఘవేంద్రసింగ్, నిఖిల్, ప్రకాశ్ జై మన్వాసి, అనికేత్, శ్రీవాస్తవ్, దివ్వాసింగ్ ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.