Coronavirus: ఎమ్మెల్యే కొడుకు పెళ్లి అదుర్స్, ఆల్ పార్టీ వీఐపీలు హాజరు, ఎఫ్ఐఆర్ తో బెదుర్స్, పాపం !
బెంగళూరు/ బళ్లారి: ప్రపంచం అంతా కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రాణాలు మిగిలితే చాలురా దేవుడా అంటూ దేవుడిని వేడుకుంటున్నారు. కరోనా దెబ్బకు భారత్ లో లాక్ డౌన్ 5.0 అమలులో ఉంది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా చాలా మంది సింపుల్ గా 50 మంది లోపు శుభకార్యాలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఓ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కొడుకు పెళ్లిన ఢాం డుస్ అంటూ వైభవంగా చేశారు. మాజీ సీఎం, మాజీ హోమ్ మంత్రి, అధికారంలో ఉన్న ఆరోగ్య శాఖా మంత్రితో పాటు అనేక మంది వీఐపీలు ఎమ్మెల్యే కొడుకు పెళ్లికి హాజరైనారు. లాక్ డౌన్ అమలులో ఉన్నా వందల మందితో పెళ్లికి హాజరైనారని, అంటువ్యాధి (కరోనా వైరస్) వ్యాపించడానికి కారణం అయ్యారని ఆరోపిస్తూ ఆ ఎమ్మెల్యేతో పాటు పెళ్లి నిర్వహకుల మీద కేసు నమోదైయ్యింది. కొడుకు పెళ్లి చేసినందుకు సంతోషించాలో, కేసు నమోదు అయ్యిందని భాదపడాలో అర్థం కాక ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం సతమతం అవుతున్నారు.
Lockdown: కరోనా కాలంలో సీఎం కూతురు రెండో పెళ్లి, ఐటీ కంపెనీ ఎండీ, పెళ్లి కొడుకు ఎవరంటే ?
మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే
కర్ణాటకలో మైనింగ్ హాట్ హబ్ గా పేరు తెచ్చుకున్న బళ్లారి జిల్లాలోని హడగలి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు పీటీ. పరమేశ్వర్ నాయక్ మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ మంత్రిగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకుని ఓ వర్గం పోగు చేసుకున్నారు.
ఎమ్మెల్యే కొడుకు పెళ్లి అదుర్స్
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ కుమారుడు అవినాష్ ప్రస్తుతం వ్యాపారాలు, రాజకీయాలు అంటూ బిజీబిజీగా ఉన్నారు. బళ్లారి జిల్లాలోని లక్ష్మీపురంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ కుమారుడు అవినాష్ వివాహం వైభవంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కావడంతో పీటీ. పరమేశ్వర్ నాయక్ దగ్గర ఉండి పెళ్లి ఏర్పాట్లు అన్ని ఆయనే స్వయంగా చూసుకున్నారు.
పెళ్లికి అధికార, ప్రతిపక్ష పార్టీల వీవీఐపీలు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీటీ. పరమేశ్వర్ నాయక్ కుమారుడు అవినాష్ పెళ్లికి అన్ని పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరైనారు. కర్ణాటక మాజీ సీఎం, విధాన సౌధలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, ఆ రాష్ట్ర మాజీ హోమ్ శాఖా మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, ప్రస్తుత ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు (బీజేపీ)తో పాటు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో సహ అనేక మంది రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరైనారు. పెళ్లికి హాజరుకావడానికి మాజీ హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ప్రత్యేక హెలికాప్టర్ లో లక్ష్మీపురంకు రావడంతో ఆయన్ను చూడానికి స్థానికులు వందల సంఖ్యలో తరలి వచ్చారు.
మాజీ సీఎం సిద్దూ పెళ్లిలో వార్నింగ్
అవినాష్ పెళ్లి జరుగుతున్న కల్యాణమండపం దగ్గరకు మాజీ సీఎం సిద్దరామయ్య చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ వందల సంఖ్యలో గుమికూడి ఉన్న ప్రజలను చూసిన సిద్దరామయ్య పెళ్లి కొడుకు తండ్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ ను పిలిచి ఏమిటయ్యా ఇది, లాక్ డౌన్ లో ఇంత హంగామా ఎందుకు ? నీ మీద కచ్చితంగా కేసుపెట్టాలయ్యా అంటూ అసహనం వ్యక్తం చేశారు. సార్, ఇక్కడ మీడియా వాళ్లు ఉన్నారు, జోకులు వేసే టైం కాదుఇది అంటూ ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ మాజీ సీఎం సిద్దరామయ్యకు నచ్చచెప్పి కల్యాణపండపం లోపలికి పిలుచుకుని వెళ్లారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్
పెళ్లికి తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, పెళ్లికి హాజరైనా చాలా మంది మాస్కులు పెట్టుకోలేదని, లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి 50 మందికిపైగా పెళ్లికి హాజరైనారని, పెళ్లిలో ఎక్కడా శానిటైజర్లు ఉపయోగించలేదని, పెళ్లిలో గుంపులో గోవిందా అంటూ కనీసం భౌతిక దూరం పాటించలేదని ఆరోపిస్తూ పెళ్లి కొడుకు అవినాష్ తండ్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ మీద కేసు నమోదు చేశామని బళ్లారి జిల్లా కలెక్టర్ ఎస్ఎస్. నకుల్ మీడియాకు చెప్పారు. ఇప్పటికే బళ్లారి జిల్లాలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందోని, అంటు వ్యాధి వ్యాపించడానికి కారణం అయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ మీద కేసు నమోదు అయ్యిందని బళ్లారి జిల్లా కలెక్టర్ ఎస్ఎస్. నకుల్ మీడియాతో అన్నారు.
నేను ఏమి చేశాను పాపం
తన మీద కేసు నమోదు అయిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ మీడియాతో మాట్లాడారు. తన కొడుకు పెళ్లికి ఎక్కువ మంది హాజరుకాకూడదని తాను ఇంతకు ముందే అందరికీ మనవి చేశానని, ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టానని వివరణ ఇచ్చారు. అయితే తన మీద ఉన్న అభిమానంతో వందల మంది పెళ్లికి హాజరైనారని, వారిని కల్యాణ మండపం నుంచి నేను ఎలా బయటకు పంపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ మీడియాను ప్రశ్నించారు.
Recommended Video
ఏం జరిగితే అది జరగని వదిలేయండి
తన మీద కేసు నమోదు చేశామని, విచారణకు హాజరుకావాలని ఇప్పటికే లక్ష్మీపురం పోలీసు అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని, తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పీటీ. పరమేశ్వర్ నాయక్ మీడియాకు చెప్పారు. తన కొడుకు అవినాష్ పెళ్లి చేసినందుకు తాను సంతోషపడాలో, రాజకీయంగా తన మీద కావాలని కేసు పెట్టినందుకు భాదపడాలో అర్థం కావడం లేదని పీటీ. పరమేశ్వర్ నాయక్ విచారం వ్యక్తం చేశారు. ఏం జరిగితే అది జరగనివ్వండి, దానికి నేను ఏమీ చెయ్యలేను అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ మంత్రి పీటీ. పరమేశ్వర్ నాయక్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.