పౌరసత్వ సవరణ చట్టం, కర్ఫూ, మంగళూరులో పోలీసు కాల్పులు, ఐసీయూలో ముగ్గురు, సీఎం షాక్ !
మంగళూరు/బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ఫూ విధించినా ఆందోళనకారులు రోడ్ల మీదకు చొచ్చుకురావడంతో వారిని నియంత్రించడానికి కాల్పులు జరపవలసి వచ్చిందని కర్ణాటకలోని మంగళూరు పోలీసులు తెలిపారు. పోలీసు కాల్పుల్లో తీవ్రగాయాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
గురువారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరు మందికి తీవ్రగాయాలు కావడంతో వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వెలుగు చూసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గురువారం కర్ణాటకలోని అనేక ప్రాంతాలతో సహ మంగళూరు నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
మంగళూరులో పరిస్థితి విషమించడంతో పోలీసులు 144 సెక్షన్ జారీ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కర్ఫూ విధించారు. కర్ఫూ అమలులో ఉన్నా ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆ సమయంలో పోలీసులు హెచ్చరించినా ఆందోళనకారుల మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆసమయంలో పోలీసులు మంగళూరు నగరంలోని బందరు పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆరు మందికి తీవ్రగాయాలైనాయి. వెంటనే వారిని మంగళూరు నగరంలోని యూనిటీ ఆసుపత్రికి తరలించారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మంగళూరు నగరంలో ఆందోళనలు ఎక్కువ కావడంతో ఎక్కడ మత ఘర్షణలు జరుగుతాయో అనే అనుమానంతో బుధవారం రాత్రి నుంచి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అయితే గురువారం ఆందోళనకారులను అదుపు చెయ్యడానికి పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ మంగళూరులో ఇలాంటి సంఘటన జరగడంపై విషాదం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. వెంటనే మంగళూరుకు ఉన్నత పోలీసు అధికారులను పంపించామని, పరిస్థితి అదుపులో ఉందని సీఎం యడియూరప్ప మీడియాకు చెప్పారు.